‘భద్రాచలం ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేటాయించండి…’
‘దివిటీ మీడియా చూడండి… చదవండి… తెలుసుకోండి…’
చీకటిని చీలుస్తూ… వెలుగు దిశగా పయనం…
ప్రధాని నరేంద్రమోదీకి బూసిరెడ్డి శంకర్ రెడ్డి లేఖ
✍️ భద్రాచలం – దివిటీ (జులై 24)
శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భద్రాద్రి ప్రాంత పరిరక్షణసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ప్రతులను బుధవారం మీడియాకు విడుదల చేశారు. భద్రాచలం రోడ్ నుంచి సారపాక వరకు, అదే విధంగా భద్రాచలం మీదుగా ఒడిశా, విశాఖపట్నంలకు రైల్వేలైన్లు ఏర్పాటు చేసి దేశానికి అనుసంధానం చేయాల్సిందిగా కోరారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతున్న భద్రాచలం పట్టణంతోపాటు బూర్గంపాడు మండలం వైపు కూడా కరకట్టలు నిర్మించాలని కోరారు. పోలవరం ముంపునకు గురవుతున్న పొలాలు, ఇళ్లను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పకడ్బందీగా అమలు చేయాలని శంకర్ రెడ్డి విఙ్ఞప్తి చేశారు. భద్రాచలం నుంచి పాపికొండల ప్రాంతం వరకు ‘టూరిజం హబ్’ అభివృద్ధి చేయడం ద్వారా గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి సౌకర్యాలు మెరుగు పడేలా కృషి చేయాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఆనాటి నిజాం ప్రభుత్వ హయాంలో పాల్వంచ పరగణా తహశీల్దార్ కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయాన్ని నిర్మించారనే చారిత్రక ఆధారాలు చూపించి భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, మీడియా, స్థానికులు, అనేక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ఉద్యమం వల్ల, కేంద్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలం పట్టణంతోపాటు బూర్గంపాడు రెవెన్యూ గ్రామం కూడా తిరిగి తెలంగాణాలో కలపడం జరిగిందని పేర్కొన్నారు. పోలవరం ముంపునకు గురవుతున్న ఈ ప్రాంతాన్ని అప్పట్నుంచి నేటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు చిన్న చూపు చూడటమే కాకుండా భద్రాద్రి ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. భద్రాచలం అభివృద్ధి, ఈ ప్రాంతంలో ముంపునకు గురవుతున్న ప్రజలను రక్షించే విధంగా ఆదుకోవడం కోసం, గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మించడానికి, ఆ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న బూర్గంపాడు, నాగినేనిప్రోలు, సారపాక, తాళ్లగొమ్మూరు, మోతె, ఇరవెండి, రామచంద్రాపురం, శ్రీరామాలయ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తామని, భద్రాద్రి ప్రాంతంలో గోదావరి ముంపు నిర్వాసితులకు శాశ్వత ప్రాతిపదికన గృహ నిర్మాణాలు చేపడతామని, విభజన వలన నష్టపోయిన భద్రాద్రి ప్రాంతాన్ని రూ.1000 కోట్లతో బ్రహ్మండంగా అభివృద్ధి చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న మాజీ సీఎం కేసీఆర్ కల్లబొల్లి మాటలు గోదావరి వరదల్లో కొట్టుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరామచంద్రుని పేరుపై రథయాత్ర నిర్వహించి జైశ్రీరామ్ అంటూ అధికారంలోకి వచ్చి శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న, శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంత అభివృద్ధిని విస్మరించడం భారతీయ జనతాపార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి తగదని విజ్ఞప్తి చేశారు, ఇప్పటికైనా శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని శంకర్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.