వరదలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి : ఆర్డీఓ

✍️ భద్రాచలం – దివిటీ (జులై 16)
గోదావరి వరదల సమయంలో ముంపునకు గురయ్యే మండలాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి, ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గోదావరి ముంపు ప్రాంతాలలో విధులు నిర్వహించే అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధంచేయాలని భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు అన్నారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ విపత్తుల స్పందన దళం సారధ్యంలో గోదావరి వరదల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై తహసిల్దార్లు, సెక్టోరల్ అధికారులు, పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరి వరదలకు ముంపునకు గురి అయ్యే గ్రామాలలో వరదలు పెరిగినప్పుడు ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించేందుకు జాతీయవిపత్తుల స్పందన దళం అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు వరదలతో నష్టపోకుండా చూసేలా సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. గోదావరి వరదల్లో ముందు జాగ్రత్త చర్యలు, వరదల్లో గ్రామాలు మునిగితే తీసుకోవలసిన చర్యలపై విపత్తుల దళం అధికారులకు సహాయ సహకారాలందిస్తారని ఆయనన్నారు. వరద ప్రభావిత మండలాల్లో అవగాహన సదస్సులు జరిపే సమయం నిర్ణయించి, వరదల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పక సదస్సులో పాల్గొనేలా చూడాలన్నారు. ప్రజలు, పశుసంపద కూడా వరదల వల్ల నష్టపోకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉన్నందున జాతీయ విపత్తుల స్పందన దళం ఇచ్చే సలహాలు, సూచనలను తు.చ. తప్పకుండా పాటించి విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో జాతీయ విపత్తుల స్పందన దళం కమాండర్ భూపేందర్ కుమార్, వరదల ప్రభావిత ఏడు మండలాల తహసిల్దార్లు , పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.