Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelangana

అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

భద్రాచలంలో గోదావరి వరద పరిశీలించిన జిల్లాకలెక్టర్

✍️ భద్రాచలం – దివిటీ (జులై 14)

గోదావరి వరదలు అంతకంతకు పెరుగుతున్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలతో ప్రజలు గోదావరి ముంపు బారిన పడకుండా చూడాలని, భద్రాచలం పట్టణములోని పలు కాలనీల్లో వరదనీరు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఆదివారం భద్రాచలం పట్టణ పరిధిలో గోదావరి వరదలు వచ్చే ప్రదేశాలను ఆయన పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ లో పంపింగ్ మోటార్లు, పరికరాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. గోదావరిలో వరద అంచనా బట్టి సీడబ్ల్యుసీ అధికారులు, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రత్యేకంగా అమర్చిన మోటార్లతో నీటిని గోదావరిలో వదిలివేస్తూ ఉండాలని, అవసరమైతే అదనపు మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వరదలు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సెక్టోరల్ ఆఫీసర్లు ఇప్పటినుంచే అప్రమత్తం చేయాలని, గోదావరివరద కాస్తంత పెరిగినా వెంటనే వారిని పునరావాసకేంద్రాలకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విస్తా కాంప్లెక్స్ పక్కనున్న డ్రైనేజీ పరిసరాలను ఆయన పరిశీలించి, డ్రైనేజీలో చెత్త పేరుకు పోకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, భద్రాచలం పట్టణంలో డ్రైనేజీలలో చెత్త పేరుకుపోవడం వల నీరు రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కూనవరం రోడ్డులో కొత్తగా నిర్మించే కరకట్టను సందర్శించి, కరకట్ట పనులు ఎంతవరకు పూర్తయ్యాయో తెలుసుకున్నారు. వరద పెరగకముందే కరకట్ట నిర్మాణం పూర్తికావాలని ఆయన అధికారులను ఆదేశించారు. భద్రాచలంలో నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ పరిశీలించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి ప్రతిరోజు వచ్చే భక్తులు, పట్టణ ప్రజలు పడవేసే చెత్తను గ్రామపంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి తప్పనిసరిగా డంపింగ్ యార్డ్ లోనే వేయాలని, ఈఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో చెత్త ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయి దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతిరోజు చెత్త తొలగించాలన్నారు. గ్రామ పంచాయతీ ఈఓ ప్రతిరోజు తప్పనిసరిగా వార్డులను పరిశీలించి, సిబ్బంది చెత్త తొలగిస్తున్నారో? లేదో?నని చూడాలన్నారు. డ్రైనేజీలలో పూడిక కూడా తప్పని సరిగా తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, స్థానిక తహసిల్దార్ శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, ఆర్ఐ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిగ్గు.. సిగ్గు.. ఇవేం మీడియాలు..ఇవేం డిబేట్లు?

Divitimedia

కమ్యూనిస్టు విప్లవ పోరుకెరటం రాయల చంద్రశేఖర్

Divitimedia

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

Divitimedia

Leave a Comment