విలువలతో కూడిన విద్యను అందించాలి : కలెక్టర్

✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 10)
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉపాధ్యాయులకు సూచించారు. పాతకొత్తగూడెంలోని విద్యాశాఖ శిక్షణమందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యనందించటం ద్వారా వారిని సమర్థవంతులైన పౌరులుగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యతని తెలియజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో ఏ భేషజాలకు పోకుండా తక్కువ ఖర్చుతో పిల్లలకు సకల సదుపాయాలు ఎలా కలుగజేయవచ్చో ఉదాహరణతో సహా కలెక్టర్ వివరించారు. అదేవిధంగా వనమహోత్సవంలో భాగంగా పాఠశాలల్లో చింత, ఉసిరి, వెలగ, కరివేపాకు, మునగ మొక్కలు తప్పని సరిగా నాటాలని, వివిధ పూలమొక్కలతో ఫ్లవర్ బెడ్స్ తయారు చేయాలని సూచించారు. నాణ్యమైన విద్య అందించడం కోసం వర్క్ షీట్స్ అందించనున్నట్లుగా తెలిపారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పిల్లలచే వర్క్ షీట్స్ సమర్థవంతంగా వినియోగింపజేసి వారిలో విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేయాలని, తద్వారా జిల్లాను విద్యపరంగా ఉన్నతస్థానంలో నిలపాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాచందన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా చేపట్టిన పనుల్లో గొప్ప పురోగతి సాధించామని, ఇదే స్ఫూర్తితో మిగిలిన పాఠశాలల్లో కూడా పనులు పూర్తిచేయాలని కోరారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించినవి ఆయా పాఠశాల కమిటీలకు అందజేశామని తెలిపారు. వనమహోత్సవంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటాలని తెలియజేశారు. పిల్లలకు యూనిఫామ్ సకాలంలో అందజేసేందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ ఆదర్శపాఠశాలల్లో సాంకేతికపరమైన సమస్యలకు సంబంధించిన అంశాలను ఆర్.అండ్.బి ఈఈ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరచారి, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, కమ్యూనిటీ మొదలైజేషన్ అధికారి ఎస్కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, బాలికావిద్య కోఆర్డినేటర్ అన్నామని, పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు, సమగ్ర శిక్ష ఫైనాన్స్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాసరావు, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.