టీజీఈడబ్ల్యుఐడీసీ అక్రమాల్లో “ఫ్యామిలీ ప్యాకేజి”…
అధికారులు, కాంట్రాక్టర్లంతా ఒకే కుటుంబం

అడ్డదారుల్లో జిమ్మిక్కు… దోపిడీలో కుమ్మక్కు…
✍️ హైదరాబాదు – దివిటీ (జులై -1)
అడ్డదారుల్లో జిమ్మిక్కులు చేస్తూ అందరూ కుమ్మక్కై అందినంత దోచుకుంటున్న అధికారులు, కాంట్రాక్టర్లతో టీజీఈడబ్ల్యుఐడీసీ నిర్వీర్యమైపోతోంది… అక్రమాల్లో ఆరితేరిన అధికారులు, కాంట్రాక్టర్లు “ఫ్యామిలీ ప్యాకేజి” మాదిరిగా దోచుకుంటున్న తీరు చూస్తే అక్రమార్కులు ఇంతగా బరితెగించారా? అనిపిస్తుంది. ఇంత ‘ఓపెన్’గా అక్రమాలు జరుగుతుంటే ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఏం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారమంతా చూస్తుంటే అక్రమార్కులకు ప్రభుత్వ పెద్దల స్థాయిలోనే ఏమైనా అండదండలున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… తెలంగాణ రాష్ట్రంలో విద్య, మౌలికసదుపాయాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన టీజీఈడబ్ల్యుఐడీసీలో తిష్టవేసుకుని కూర్చున్న అక్రమార్కులైన కొందరు అధికారుల దోపిడీ పర్వం యధేచ్ఛగా సాగిపోతున్నవైనంపై ‘దివిటీ మీడియా’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది…
టీజీఈడబ్ల్యుఐడీసీలో కొంతకాలంగా అవినీతి అనకొండ ఒకటి చక్రం తిప్పుతోంది. 2016లో ఆయన ఓ కాంట్రాక్టర్ దగ్గర రూ.27,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు దొరికాడు. అంతేకాకుండా రాష్ట్రమంతటా విద్యార్థినులకు సంక్షేమ పథకం కింద పంపిణీ చేసిన దాదాపు రూ.100కోట్ల విలువైన కాస్మెటిక్స్, శానిటరీ ప్యాడ్స్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన అధికారులలో ఓ కీలక అధికారి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వాడిగా విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారాయన. ఈ తరహా అవినీతి చరిత్ర కలిగిన అవినీతి అనకొండ, తన పలుకుబడితో ఓ ఉమ్మడి జిల్లా(రెండు జిల్లాల)లో ఈఈ హోదాలో అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. అప్పటి కేసులలో నేటికీ విచారణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి విచారణలు, కేసుల విషయాన్ని పక్కనపెట్టి మరీ ఇంకా చెలరేగిపోతున్నారు. తనపైనున్న కేసులను పట్టించుకోకుండా ఆ సంస్థ ఉన్నతాధికారులే ఆయనకు రెండు జిల్లాల బాధ్యతలు కట్టబెట్టడంతో ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాలకు ఓ ఉన్నతాధికారిగా ఎదురూ బెదురూ లేకుండా ‘ఫ్యామిలీ ప్యాకేజి’ తయారుచేసుకుని మరీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడు.
——————————–
ఆ కుటుంబంతో కొనసాగుతున్న ‘అవినీతి బంధం…
—————————–
2005-06లో పనికి ఆహారపథకం అభివృద్ధి పనుల్లో ఆ ఈఈ తనకు సహాయకారిగా, జూనియర్ అధికారిగాను ఏఈ హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తితో కలిసి రూ.1-50కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించారు. ఆ అక్రమాల్లో ఈఈ కీలకపాత్ర పోషించినప్పటికీ బాధ్యత తన భుజాన వేసుకుని మరీ అతనిని కాపాడిన ఆ ఏఈ 2007-08లో సస్పెండైన చరిత్ర ఉంది. ప్రస్తుతం అతను డీఈ హోదాలో టీజీఈడబ్ల్యుఐడీసీలో పనిచేస్తున్నారు. పక్కజిల్లాలో పనిచేస్తున్న ఆ డీఈకి తమ మధ్యనున్న ఆనాటి అనుబంధంతో ఈఈ, తన పరిధిలోనే మరో జిల్లాలో కూడా ‘ఇన్ఛార్జి’ పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించారు. అంతటితో ఆగకుండా, ఓవైపు ఆ కేసు విచారణలో ఉన్నప్పటికీ, ఆ డీఈకి తనపరిధిలో మళ్లీ రెగ్యులర్ డీఈ హోదా పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆ ఈఈ అడ్డదారిలో పావులు కదులుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంక ఆ ఇన్ఛార్జి డీఈ రెగ్యులర్ హోదాలో ఇక్కడకొస్తే తమకు సహకరించాలని ‘టార్గెట్’ చేసి మరీ అవస్థలు పెడతారని కిందిస్థాయి సిబ్బంది భయపడుతున్నారు.
———————-
అందరూ ‘బంధువులే’… అక్రమాలకు ‘సూత్రదారులే’…
———————-
ప్రస్తుతం టీజీఈడబ్ల్యుఐడీసీలో అక్రమాల అనకొండగా పేరున్న ఆ ఈఈ, ప్లాన్ ప్రకారం మరింతగా దోపిడీలకు పక్కాగా ‘స్కెచ్’ వేశారు. ఆ ఈఈకి విశ్వాసపాత్రుడైన డీఈ, అతని తోడల్లుడైన మరో ఏఈ కూడా అదే జిల్లా లో, ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారు. తోడల్లుళ్లిద్దరూ ఒకేచోట డీఈ, ఏఈలుగా ఉండగా సదరు ఏఈ సొంత సోదరుడు కూడా అక్కడే కాంట్రాక్టరుగా పనులు చేస్తూ ఉండటం విశేషం. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే ఆ ఏఈ పర్యవేక్షణలోనే అతని సోదరుడు ఓ గ్రామంలో ‘మన ఊరు-మన బడి’ పథకం కింద అభివృద్ధి పనులు చేయడం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా సాగుతున్న ఈ “ఫ్యామిలీ ప్యాకేజి” వ్యవహారాలపైన తెలిసి కూడా సదరు ఈఈ అక్రమాలకు సహకరించడం కొసమెరుపు. ఇంతటి దారుణమైన పరిస్థితులున్నప్పటికీ, నేటివరకు అక్రమార్కులైన ఆ ఈఈ, డీఈ, ఏఈ బృందం మీద ఏ ఉన్నతాధికారీ చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం ఇప్పటికైనా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలన్నిటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ద్వారా సంస్థ భవిష్యత్తును, ప్రజాధనాన్ని కాపాడాలని పలువురు సామాజికవేత్తలు కోరుతున్నారు.