కొత్తగూడెంలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
✍️ కొత్తగూడెం – దివిటీ (జూన్ 28)
కొత్తగూడెం 1 టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసులు శుక్రవారం ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పోస్టాఫీస్ సెంటర్ వద్ద ఎస్సై విజయ తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా పోలీసు వారిని చూసి ద్విచక్ర వాహనంతో అటుగా వస్తున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని పట్టుకున్న పోలీసులు విచారణలో అతనిని స్థానిక చుంచుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సల్లా చంద్రశేఖర్ అనే వ్యక్తిగా గుర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రత్నాలచెరువు ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నాడని పోలీసులకు తెలిపాడు. కొత్తగూడెం బస్టాండ్ ఏరియాలో మూడు బైకులను దొంగతనం చేసినట్లుగా అతను అంగీకరించాడని, వన్ టౌన్ సీఐ కరుణాకర్ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ చేసే నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ ఘని, కానిస్టేబుళ్లు సురేష్, వీరన్న, నరేష్, ప్రసాద్ లను ఈ సందర్బంగా సీఐ అభినందించారు.