ఎన్.హెచ్.ఎం బకాయిలు విడుదల చేయాలని కోరిన సీఎం రేవంత్
✍️ న్యూఢిల్లీ – దివిటీ (జూన్ 25)
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పథకం కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయనను కలిసి వైద్య, ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు. ఆరోగ్య మిషన్ 2023-24లో మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్లో ఉండటమే కాకుండా 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ కూడా రూ.138 కోట్లు మంజూరు చేయాల్సి ఉందని, మొత్తం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నింటిని తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రికి వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన మౌలిక వసతులు, నిర్వహణ నిధుల కింద 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ.231.40 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నిధుల విడుదలలో జాప్యం కావడం వల్ల అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి నడ్డా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.