మానవత్వంతో స్పందించిన ‘ఉన్నత’ హృదయం…



బాధ్యతాయుతమైన సేవకు నిర్వచనం చెప్పిన కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 16)
ఆపదలో ఉన్నవారిని చూసిన ఆ ‘ఉన్నత’ హృదయం మానవత్వంతో స్పందించింది… తాను ఆదేశిస్తే చాలు బాధ్యతగా పనులు చేసిపెట్టేవారున్నప్పటికీ సున్నిత మైన ఆ హృదయం మానవత్వంతో స్పందించి, తానే స్వయంగా బాధ్యత తీసుకుంది… ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంది. ఆపదలో ఉన్నవారికి తన వంతు బాధ్యతగా సేవలందించి, ఆ గుండెల్లో ధైర్యం నింపింది… ఆపదలో ఉన్నవారికి మానవత్వంతో తానే స్వయంగా సేవ చేసిన ఆ ఐఏఎస్ అధికారి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆపన్నహస్తం అందించేందుకు, మానవత్వం చాటేందుకు హోదా అడ్డురానే రాదంటూ నిరూపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరుగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీఓగా కూడా అదనపు బాధ్యతలు చేపట్టి దైవదర్శనం చేసుకుని కొత్తగూడెం తిరిగి వెళ్తున్న సమయంలో బూర్గంపాడు మండలంలోని అడ్డరోడ్డు వద్ద ఓ రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ఆటో, ఓ ద్విచక్ర వాహనం ఢీకొని ఆరుగురు గాయాలపాలై, ఆ రోడ్డు మీదే విలవిలలాడుతున్న దృశ్యం చూసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, వెంటనే తన వాహనాలను ఆపించి, స్వయంగా బాధితులను ఆదుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే, తన కళ్లముందే విలవిలలాడుతున్న ఆ బాధితులను చూసి స్పందించిన ఆయన స్వయంగా వారిని వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వారికి సాయం చేసే పనిని తన కిందిస్థాయి సిబ్బందికి అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ, కలెక్టర్ స్వయంగా సేవలందించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచింది. జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన స్పందించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారి హోదాలో ఆయన పనితీరు ఎలా ఉండే అవకాశముందనే అంశానికి ఈ ప్రమాద సంఘటన అద్దంపడుతోందని ప్రజలు అభినందిస్తున్నారు.