విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు మెరుగుపరచాలి
విద్యాలయాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ

✍️ దివిటీ మీడియా – పాల్వంచ (మే 16)
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమపాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు పాఠశాల, వసతి గృహాల్లో మైనర్ రిపేర్లు, ప్యాచ్ వర్క్, డ్యూయల్ డెస్క్ బల్లల రిపేర్లు మే 20వ తేదీ నాటికల్లా పూర్తిస్థాయిలో చేయించి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్పెషల్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ ఆదేశించారు. గురువారం పాల్వంచ మండలం కిన్నెరసానిలోని బాలుర ఆశ్రమ పాఠశాల, పాల్వంచలోని బాలికల వసతిగృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో టాయిలెట్లు, వాష్ రూములు, డార్మెటరీ, తరగతిగదులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశ్రమపాఠశాలలను తమ ఇంటిని తలపించేవిధంగా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులున్నందున పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి సంబంధించిన ప్యాచ్ వర్కులు, మైనర్ రిపేర్లు, ప్రతి తరగతిగది, డైనింగ్ హాలు, డార్మెటరీలలో గాలి వెలుతురు సక్రమంగా వచ్చేలా ఏర్పాట్లు చేయాలని పీఓ ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలలో వెంటిలేటర్స్ నుంచి క్రిమికీటకాలు రాకుండా మెస్ వేయించాలని, డార్మెటరీ తరగతిగదులకు ఆల్ఫాబెట్స్ ప్రకారం నెంబర్లు వేయాలని, విద్యార్థినీ విద్యార్థులు పడుకునే రూములలో ప్రతి నాలుగు బెడ్లకు కలిపి ఒక ఫ్యాన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వేర్వేరుగా ఉండాలని, పాఠశాలలకు సంబంధించి మైనర్ రిపేర్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అమర్చే పనులన్నీ మే 20వ తేదీలోగా పూర్తికావాలని తెలిపారు. విద్యార్థులు కింద పడుకోకుండా డబుల్ కాట్ మంచాలు ఫిట్ చేయించి ప్రతి విద్యార్థి మంచాల మీదే పడుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డ్యూయల్ డెస్క్ బల్లలు పాడైపోతే వెంటనే రిపేరు చేయాలన్నారు. ముఖ్యంగా టాయిలెట్లు, వాష్ రూమ్స్ లో శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేయాలని, యాసిడ్ తో శుభ్రంచేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు.

ఫ్లోరింగ్ పగుళ్లు తేలి ఉండడంతో తప్పనిసరిగా ప్యాచ్ వర్క్ చేయించాలని, పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తాచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. డ్రైనేజీలలో మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. పాఠశాల తరగతి గదులు, డార్మెటరీలలో చీమలు తిరుగుతున్నాయని, చీమలు రాకుండా లక్ష్మణరేఖ లాంటి కాయిల్స్ ద్వారా నిర్మూలించాలని తెలిపారు. గోడలపై పనికిరాని చెట్లు మొలుస్తున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఆయన ఆదేశించారు. పిల్లలు బట్టలు ఉతుక్కున్న తర్వాత ఆరవేసుకోవడానికి జీఐ వైరుతో బయట దండాలు కట్టేయాలని, వాష్ రూమ్ టాయిలెట్లకు డోర్లు పాడైపోతే రిపేర్ చేయించాలన్నారు. ఆవరణ, ఫ్లోరింగ్ పగుళ్లు తేలి ఉన్నందున ప్యాచ్ వర్క్ త్వరితగతిన చేయాలన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులు రాగానే, వారు ఇంటిని మర్చిపోయేలా మంచి వసతి సౌకర్యాలు కల్పించి విద్యాభ్యాసానికి ఆటంకం కలగ కుండా చర్యలు చేపట్టాలన్నారు. మరోసారి ఆకస్మిక తనిఖీకి వచ్చేనాటికి ఆశ్రమ పాఠశాలల్లో అన్నిరకాల పనులు పూర్తి కావాలని, లేకపోతే బాధ్యులైన సిబ్బంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా పీఓ, పాఠశాలలోని వంటగదులు, డబుల్ కాట్స్, గోడలకు ప్యాచ్ వర్కులను పరిశీలించారు. కార్యక్రమంలో డీడీ (ట్రైబల్ వెల్ఫేర్) మణెమ్మ, కిన్నెరసాని పాఠశాల హెచ్ఎం చందు, తదితరులు పాల్గొన్నారు.