పినపాక నియోజకవర్గంలో హోంఓటింగ్ ప్రక్రియ ఆరంభం
తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్

✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు (మే 3)
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో మహబూబాబాద్(ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గంలో పినపాక(ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో దివ్యాంగులు, 85 సంవత్సరాల వయసు పైబడిన వారి కోసం హోమ్ ఓటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. సంబంధిత పినపాక (ఎస్టీ) అసెంబ్లీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. శుక్రవారం బూర్గంపాడు మండలం లోని సోంపల్లి ,రెడ్డిగూడెం గ్రామాలలో తహసిల్దార్, ఆర్ఐ, ఓటింగ్ బృందాలతో సాగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలసంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారం పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లోని ఏడు మండలాల్లో 45 మంది 80 సంవత్సరాల పైబడినవారు, 78 మంది దివ్యాంగులు హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆ ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులు, రూట్ మ్యాపులు జారీ చేశామని, రూట్ మ్యాపులు, పోలింగ్ సిబ్బంది, ఓటింగులో పాల్గొనే ఓటర్ల వివరాలను సంబంధిత పార్టీలు, పోటీచేసే అభ్యర్థులకు తెలియజేశామన్నారు. హోం ఓటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం మే 8 నాటికి పూర్తిచేయాలని, హోం ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్, ఓట్ల వివరాలు, పోటీలోని అభ్యర్థులకు తెలియజేసినట్లు వెల్లడించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి, ఆ కుటుంబ సభ్యుల సమక్షంలోనే తప్పనిసరిగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియకు నియమించబడ్డ సిబ్బంది తప్పని సరిగా ఓటర్ జాబితాలో సంబంధిత వయోవృద్ధుల పేర్లు, దివ్యాంగుల పేర్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నదీ తప్పకుండా పరిశీలించిన తర్వాతనే ఆ వ్యక్తి ఓటు నమోదు చేయాలని, ప్రతి అంశం ఫోటో, వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించారు. తహసిల్దార్లు హోం ఓటింగ్ బృందాలకు ఎన్నికల నిబంధనలు తెలియజేసి, ఏ గ్రామంలో వయోవృద్ధులు, దివ్యాంగులు ఉన్నారో తెలుసుకుని, తప్పనిసరిగా ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఏ ఒక్క ఓటరును వదలకూడదన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై ఎన్నికల నిబంధనల ప్రకారం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రతిఒక్కరూ బాధ్యతగా వారి విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు తహసిల్దార్ ముజాహిద్ , ఆర్ఐ, గెజిటెడ్ అధికారులు, పీఓలు, ఓటింగ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.