ఇంటర్ పరీక్షకేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
✍ దివిటీ మీడియా – కొత్తగూడెం, ఫిబ్రవరి 28
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల, కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, నీటి వసతిని తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అన్ని గదుల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వారికి ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి ప్రత్యేక స్వ్కాడ్ టీమ్స్ అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంటర్ మొదటి సంవత్సరం 10200 మంది, ద్వితీయ సంవత్సరం 9277 మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఫ్లయింగ్ స్వ్కాడ్, సిట్టింగ్ స్వ్కాడ్, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనరాణి, సింగరేణి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్ష కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.