Divitimedia
Andhra PradeshBhadradri KothagudemCrime NewsDELHIHanamakondaHyderabadJayashankar BhupalpallyKhammamLife StyleMuluguNational NewsPoliticsSpecial ArticlesTechnologyTelangana

అంతర్రాష్ట్ర ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడేనా…?

అంతర్రాష్ట్ర ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడేనా…?

సీఎం ఆదేశిస్తే తప్ప అధికారులు పట్టించుకోరా…?

సందేహాలు రేకెత్తిస్తున్న అంతర్రాష్ట్ర ఇసుక అక్రమ రవాణా

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో బంగారంలాగా మారిపోయిన గోదావరి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న అక్రమార్కులు ‘మాఫియా’ స్థాయిలో చెలరేగిపోతున్నారు. ప్రజాసంపదను ప్రభుత్వం తరపున కాపాడుకునే పని చేయాల్సిన అధికారులు కళ్లప్పగించి చూస్తూ ఉంటే, ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగి పోతోంది. ఇరవై, ముప్ఫై టన్నుల బరువుతో జాతీయ రహదారిపై తిరుగుతున్న ఇసుక లారీలు అధికారులకు మాత్రం ‘కంటికి కనిపించని’ అదృశ్య వాహనాలుగా మారి పోయాయి. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో లారీలు ఇసుక అక్రమ రవాణా సాగిస్తుంటే అధికారులకు అవేమీ కనిపించకుండా ఉండటానికి ‘కాసుల కక్కుర్తి’ కంటే మించిన కారణమేదీ కనిపించడం లేదు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భద్రాచలం నుంచి వాజేడు సరిహద్దు వరకు, ఇటు బూర్గంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుక్కునూరు దాకా గోదావరి ఇసుక ‘దోపిడీ’కి గురవుతోంది. ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ‘అక్రమార్కులు’ కుమ్మక్కై సాగిస్తున్న ఈ అక్రమదందా ప్రతిరోజూ కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది. అటు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ప్రాంతాలతోపాటు ఇటు పినపాక, మణుగూరు, అశ్వాపురం ప్రాంతాల నుంచి గోదావరినదిలో ఇసుక కొల్లగొడుతున్నారు. ఇటు బూర్గంపాడు మండలం సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని వెంకటాపురం, పెద్దరావిగూడెం, ఇబ్రహీంపేట, కుక్కునూరు ప్రాంతాల నుంచి కూడా గోదావరి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క’ జాతర ఉన్న నేపథ్యంలో పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో గోదావరిఇసుక అక్రమంగా తరలించేందుకు జాతరకు వచ్చే వాహనాలు అడ్డంకిగా మారాయి. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం ప్రాంతాల నుంచి ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా లారీలు తిరిగేందుకు జాతర ట్రాఫిక్ ఆటంకంగా మారడం వల్ల ఆ లారీలన్నీ బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా హైదరాబాదు వైపు ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు తాజాగా ‘ఇసుక అక్రమరవాణా’ లారీలు అడ్డుకుంటుండంతో బూర్గంపాడు మండలంలో దాదాపు 20వరకు ఇసుక లారీలు బుధవారం ఇరుక్కపోయాయి. కుక్కునూరు మండలం నుంచి వచ్చిన రెండు లారీలను పట్టుకున్న బూర్గంపాడు పోలీసులు ఇంకోవైపు సారపాక, అడ్డరోడ్డు, లక్ష్మీపురం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడంతో ఇసుక అక్రమ రవాణా లారీలను ఎక్కడికక్కడ వదిలేసి మరీ డ్రైవర్లు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేఒక్క రోజు తనిఖీలతోనే ఇంత భారీసంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేసే లారీలు పట్టుబడిన వ్యవహారం చూస్తూంటే, ప్రతిరోజూ ఈ అక్రమ వ్యాపారం ఏ రేంజిలో సాగుతుందో? ఊహించుకోవచ్చు. ఇటీవల పోలీసుశాఖలో పెద్దఎత్తున బదిలీలు జరగడంతో కొత్తగా వచ్చిన అధికారులు ఇసుక అక్రమ రవాణా మీద తమ ప్రతాపం చూపించే అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు మధ్య నలుగుతుండగా, ఏ మలుపు తిరుగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
————————
ఇసుక అక్రమంలో అధికారుల ప్రేక్షకపాత్రపై అనుమానాలు
————————
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల నుంచి ఇంత భారీగా ఇసుక అక్రమ వ్యాపారం కొనసాగుతుంటే ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు ఏంచేస్తున్నారనేది అంతులేని అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనుంచి యధేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమదందాను నిరోధించేందుకు ఆ రాష్ట్ర అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు లీడర్లు, వ్యాపారులు కలిసి ఈ అక్రమదందా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకర్యాంపులు అక్రమంగా ఏర్పాటు చేసి, యంత్రాలతో పెద్దమొత్తంలో తోడుతున్న ఇసుకను తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు. హైదరాబాదు, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ఈ సరిహద్దుల నుంచే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. తనిఖీలు నిర్వహించి ఈ అక్రమ దందాకు అడ్డుకట్టవేయాల్సిన పోలీసు, మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్, రవాణా శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్న తీరు చూస్తుంటే ఈ దందాకు ఏమేరకు సహకరిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికైనా పోలీసులు చేపట్టిన తనిఖీలు ప్రతిరోజూ కొనసాగించాలని, మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో ఈ అక్రమదందాకు అడ్డుకట్ట వేయాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు.

Related posts

“తగ్గేదెలే…” మేడమ్ టుస్సాడ్స్ సెల్ఫీతో అల్లు అర్జున్ హంగామా

Divitimedia

శ్రీరామనవమి ఏర్పాట్లపై 6న సమీక్ష సమావేశం

Divitimedia

ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ, సీఐ

Divitimedia

Leave a Comment