కోరం కనకయ్యను సన్మానించిన జడ్పీ అధికారులు, సిబ్బంది
✍🏽 దివిటీ – కొత్తగూడెం (జనవరి 12)
జడ్పీ చైర్మన్ గా పనిచేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇల్లందు శాసనసభ్యునిగా ఎన్నికైన కోరం కనకయ్యను శుక్రవారం జడ్పీ అధికారులు, సిబ్బంది సన్మానించారు. కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన ఈ ఆత్మీయ అభినందన సభలో ఆయన పాల్గొని, తనను ఇంతవాడిని చేసిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలు పరిష్కరించి, నిరుపేద వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల మాట్లాడుతూ, జడ్పీచైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇల్లందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోరం కనకయ్య పరిపాలనలో ప్రజల మన్ననలు పొందారని, అధికారులకు ఎప్పటికపుడు తగిన సలహాలు సూచనలు అందిస్తూ ముందుకెళ్లారని అభినందించారు. ఈ సందర్భంగా కనకయ్య దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కె చంద్ర శేఖర్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

