నేడు మంత్రి పొంగులేటి సింగరేణి ఎన్నికల ప్రచారం
✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం (డిసెంబర్ 24)
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఐ.ఎన్.టి.యు.సి కార్మిక యూనియన్ కు మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలను క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా ఉదయం 7 గంటలకు ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు పట్టణంలో, ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణంలో సింగరేణి కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో, సాయంత్రం 6.30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలంలో సింగరేణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.