Divitimedia
Bhadradri KothagudemDELHIHyderabadLife StyleNational NewsPoliticsSpecial ArticlesTechnologyTelangana

ఉన్నతాధికారులూ స్వతంత్రంగా వ్యవహరించలేరా… ?

ఉన్నతాధికారులూ స్వతంత్రంగా వ్యవహరించలేరా… ?

గోదావరి రెండో వంతెన ఆలస్యం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఫలితమేనా…

మంత్రి తుమ్మల ఆదేశాలతోనైనా మోక్షం కలుగుతుందో, లేదో…

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం

రెండేళ్లలో పూర్తి చేయాలనుకున్న భద్రాచలం రెండో వంతెన పనులు తొమ్మిదేళ్లయినా పూర్తి కాకపోవడానికి భద్రాద్రి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం మారి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టి, తనిఖీ చేసి ఆదేశాలు జారీ చేస్తేనేగానీ ఈ పనుల గురించి జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. పనులు ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించిన సందర్భంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల, ఈ వంతెన పనులపై సమీక్షించేందుకు నిర్ణయం తీసుకున్న తీరు చూస్తుంటే ఇంతకాలం ఉన్నతాధికారులేం చేశారనే ప్రశ్శ తలెత్తక మానదు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ గానీ, గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు అనుదీప్, ఎం.వి.రెడ్డి గానీ ఈ రెండో వంతెన పనుల జాప్యంపై స్పందించిన దాఖలాలు లేవు. తమపై అంతగా వత్తిడి లేకపోవడంతో నేషనల్ హైవే విభాగం అధికారులు కూడా అంత బాధ్యతగా పనులు చేయించలేదనేది జగమెరిగిన సత్యం. కేవలం ఓ కేంద్ర మంత్రికి బంధువులనే కారణంతోనే ఉన్నతాధికారులు ఈ పనుల తీరుపై కాంట్రాక్టర్లను ఏమీ చేయలేకపోయారనే అనుమానాలున్నాయి. కాంట్రాక్టర్ల పలుకుబడి, స్థాయిని బట్టి అభివృద్ధి పనుల తీరుపై జిల్లా ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తున్నారంటే వారి స్థాయిని దిగజార్చుకున్నట్లు భావించే పరిస్థితి ఏర్పడుతుందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాజకీయాల మధ్య రాగద్వేషాలతో పాలన సాగించే పాలకుల కంటే అధికంగా బాధ్యత కలిగిన అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. 2014 అక్టోబరులోనే ఈ వంతెన పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు, రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టినప్పటికీ, తొమ్మిది సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. అందులోనూ నాణ్యత ప్రమాణాలపైన కూడా ఆరోపణలు, విమర్శలు కూడా రావడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. చిన్న చిన్న పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లపై ఎప్పటికప్పుడు వత్తిడితో పనులు చేయించే ఉన్నతాధికారులు కూడా ఇలా మంత్రుల బంధువులనో, బలవంతులనో తమ బాధ్యత ఏమీ లేనట్లుగా చర్యలు తీసుకోకపోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం అభివృద్ధిపై తనకున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ రెండో వంతెన పనులు ఆదివారం(డిసెంబర్ 17) పరిశీలించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో మంత్రులు గానీ, ఉన్నతాధికారులు గానీ ఈ విధంగా పరిశీలించి, ఆదేశాలిచ్చిన దాఖలాలు లేవు. దీనిని బట్టి చూస్తే ఈ వంతెన పనుల జాప్యానికి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా ప్రత్యేక కారణమని స్పష్టంగా తెలుస్తోంది. పనులకు సంబంధించి పూర్తి వివరాలతో తన కార్యాలయానికి రావాలని, పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి…
————————–
వంతెన పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
————————–
భద్రాచలం అదనపు వంతెన నిర్మాణ పనులు వారంలోగా పునఃప్రారంభించి ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల విభాగం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద రెండో వంతెన నిర్మాణ పనులను ఆయన ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ పనుల్లో ఇప్పటి వరకు తీవ్ర జాప్యం జరిగిందని, వేగవంతం చేయాలని చెప్పారు. 2015లో శంకుస్థాపన చేస్తే నేటి వరకు బ్రిడ్జి పనులు సాగదీస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణం పనులు ప్రారంభించాలని చెప్పారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రహదారి పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. దేవస్థానానికి దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే భద్రాచలాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు మోడల్ డివైడర్లు, ఫుట్ పాత్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం నుంచి జగదల్ పూర్ వరకు రహదారి పరిస్థితుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు గ్రామం వద్ద వంతెన వెడల్పు పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనుల జాప్యంపై మూడుసార్లు తొలగించినప్పటికీ ఏజెన్సీ తీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేసి, పనులను జాప్యం చేయడం తగదని హెచ్చరించారు. 2015లో రాష్ట్ర మంత్రిగా తాను, కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశామని అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. పనులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇంకా జాప్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని చెప్పారు. రూ.90 కోట్లు మంజూరు చేశామని వాటిలో రూ.65 కోట్లు విడుదల కాగా, 58 కోట్ల పనులు పూర్తి చేశామని, ఇంకా రూ.7 కోట్ల పనులు పెండింగులో ఉన్నాయని సైట్ ఇంజనీర్ తెలిపారు. వంతెనతో పాటు రెండు వైపులా అప్రోచ్ రహదారి పనులు చేపట్టాలని చెప్పారు. అప్రోచ్ రోడ్ నిర్మాణానికి మట్టి దొరకడం లేదంటూ సైట్ ఇంజనీర్ చెప్పిన సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. మట్టి సమకూర్చుకోవాలని, చంద్రమండలం నుంచి తీసుకొస్తారా? అంటూ ప్రశ్నించారు. పిలర్స్ పూర్తి అయ్యాయి కాబట్టి ఇంకా పనుల్లో జాప్యం చేయొద్దని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, ఏజన్సీలు సమగ్ర నివేధికలతో కలెక్టర్ కార్యాలయానికి రావాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలోనే వంతెన నిర్మాణ పనులపై మంత్రి తుమ్మల ఫోన్ లో ఈఎన్సీ గణపతిరెడ్డి, భారతప్రభుత్వ జాతీయ రహదారుల విభాగం ప్రాంతీయ మేనేజర్ కుష్వాలతో మాట్లాడి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అవసరమైతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తాను మాట్లాడతానని, ఎట్టి పరిస్థితుల్లో వారం రోజుల్లోగా పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఎన్.హెచ్ ఈఈ యుగంధర్, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఆర్డీఓ మంగీలాల్, ఎన్ హెచ్ డీఈ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నర్సరీ ఆధునీకరణ ప్రణాళికలకు ఐటీడీఏ పీఓ ఆదేశాలు

Divitimedia

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

Divitimedia

శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఐటీడీఏ పీఓ, కుటుంబసభ్యులు

Divitimedia

Leave a Comment