రాష్ట్రంలో ‘డ్రగ్స్’ నిరోధానికి ఉక్కుపాదం : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తరహాలో ‘టీఎస్ నాబ్’ విభాగం
పూర్తిస్థాయి డైరెక్టర్ నియామకానికి చర్యలకై ఆదేశాలు
రైతుబంధు నిధులు విడుదల, రుణమాఫీపై కార్యాచరణకు ఆదేశాలు
ఇకనుంచి రాష్ట్రంలో మంగళ, శుక్రవారాల్లో ‘ప్రజావాణి’ నిర్వహణకు నిర్ణయం
వ్యవసాయ, ఎక్సైజ్ శాఖల పనితీరుపై సోమవారం (డిసెంబర్ 11) డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వేర్వేరుగా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశాల్లో రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక, సాంస్కృతికశాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు, వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐ.టి, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్ ను నియమించడంతో పాటు ఆ విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల విక్రయిం, చెలామణిని నిరోధించడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ విభాగాల మాదిరిగా “టీఎస్ నాబ్”ను తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
———————-
నేటి నుంచే ‘రైతుబంధు’ నిధుల విడుదల: సీఎం
———————-
రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమీక్షలో ఆయన రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతులకు నేటినుంచే ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణ మాఫీ చేయడం కోసం తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
———————–
ఇకనుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహణకు ఆదేశించిన సీఎం
———————–
రాష్ట్రంలో ఇకనుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ‘జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్’లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుంచి ‘ప్రజావాణి’గా పిలవాలని సీఎం ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ని ఇకనుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణిలో ఉదయం 10 గంటలలోపు జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారం చేపట్టినందుకు అభినందించారు.






