Divitimedia
Bhadradri KothagudemHealthTelangana

అర్హులందరికీ ‘ఆయుష్మాన్ భవ’ కార్డులు జారీ చేస్తాం : కలెక్టర్

అర్హులందరికీ ‘ఆయుష్మాన్ భవ’ కార్డులు జారీ చేస్తాం : కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – పాల్వంచ

అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘ఆయుష్మాన్ భవ’ ఆరోగ్య కార్డులు జారీచేయనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఆయుష్మాన్ భవ’ కార్యక్రమాన్ని బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించగా, ఆ కార్యక్రమానికి పాల్వంచ కమ్యూనిటి హెల్త్ సెంటర్ నుంచి జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంక, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఆ ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ముక్కంటేశ్వరావు, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మణికంఠరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తెల్లరేషను కార్డు కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ‘ఆయుష్మాన్ భవ’ పథకంలో ఆరోగ్యకార్డులు జారీచేయనున్నట్లు వెల్లడి చేశారు. జిల్లాలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పధకానికి అదనంగా ఆయుష్మాన్ భవ ద్వారా ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని మూడు విభాగాలుగా విభజించామన్నారు. ఆయుష్మాన్ ఆప్కే ద్వార్, ఆయుష్మాన్ సభ, ఆయుష్మాన్ మేళా కార్యక్రమాలతో ఈ సమాచారం ప్రతి గుమ్మానికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయుష్మాన్ మేళా కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటి ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ సభల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో గ్రామ సభలు నిర్వహించి నమోదు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరిని నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 17వతేదీ నుంచి అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆయుష్మాన్ భవ పథకంలో నమోదైన వారికి రూ.5 లక్షల విలువ గల వైద్యసేవలు అందించనున్నట్లు చెప్పారు. ఏ ఆరోగ్యకేంద్రాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారో ముందస్తుగా షెడ్యూలు ప్రకటిస్తారని, అదే షెడ్యూల్ ప్రకారం ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఆరోగ్య మిత్ర కార్యకర్తలు, అర్హులైన తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నమోదయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పథకం వల్ల యూనివర్సల్ హెల్త్ కవరేజి లభిస్తుందని కలెక్టర్ డా ప్రియాంకఅల చెప్పారు.

Related posts

ప్రాణాంతకంగా మారిన అంతర్రాష్ట్ర రహదారి

Divitimedia

‘గిరిజన దర్బార్’ కు సకాలంలో హాజరు కావాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

తెదేపా సభ్యత్వాల్లో ‘పినపాక’కు రాష్ట్రంలో మూడోస్థానం

Divitimedia

Leave a Comment