Divitimedia
Bhadradri KothagudemTelanganaWomen

అపరిశుభ్రత, దుర్గంధంతో అంగన్ వాడీ కేంద్రాలు

అపరిశుభ్రత, దుర్గంధంతో అంగన్ వాడీ కేంద్రాలు

సిబ్బంది సమ్మెతో అధికారుల కళ్లకు కడుతున్న లోపాలు

ఆకస్మిక తనిఖీలో అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ డా.ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

అపరిశుభ్రత, దుర్గంధం, నిర్లక్ష్యం నడుమ ఎవరికీ పట్టని అంగన్ వాడీ కేంద్రాల దుస్థితి ఎట్టకేలకు బయటపడింది. ఏళ్ల తరబడి ఎక్కడివారు అక్కడే పాతుకుపోయి, కింది స్థాయి సిబ్బందితో ‘అవసరమైనదాని కంటే మించి కలిసిపోయి, ఫ్రెండ్లీ పర్యవేక్షణలతో’ దుర్గతిపాలు చేసిన అధికారుల నిర్వాకాలు కూడా కళ్లకుకడుతున్న అస్తవ్యస్త పరిస్థితిని చూసి అవాక్కవడం జిల్లా ఉన్నతాధికారుల వంతయింది. చిన్నారులు, మహిళలకోసం పౌష్టికాహారం అందించేందుకు అవసరమైన సరకులు, కోడిగుడ్లతో సహా వివిధ రకాలైన రిజిస్టర్లు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా పడేసి ఉండటం చూసిన ఉన్నతాధికారులు ‘షాక్’ తిన్నారు. ఆరోగ్యవంతులుగా ఎదగాల్సిన చిన్నారులు ఎంతటి దుస్థితి నడుమ రోజూ కాలం గడుపుతున్నారనేది అధికారులకు అర్థం అయింది. ఈ దుర్భర పరిస్థితులను కళ్లారాచూసిన అధికారులు, సిబ్బంది సమ్మె కారణంగా అందుబాటులో లేకపోవడంతో మిన్నకుండిపోయారని అర్థమవుతోంది. ఈ రెండు రోజుల నుంచి సిబ్బంది సమ్మెలోకి వెళ్లినప్పటికీ, అంతకుముందు నుంచే ఇలా దుర్భర పరిస్థితులున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ విషయం గుర్తించి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అంగన్ వాడీ సిబ్బంది కూడా విధులకు దూరమయ్యారు. రెండు రోజుల నుంచి సిబ్బంది సమ్మెకు దిగి, అంగన్ వాడీ కేంద్రాల్లో సేవలు బహిష్కరించి ఉండగా, మంగళవారం (సెప్టెంబరు 12న) జిల్లాకలెక్టర్ డా.ప్రియాంకఅల అశ్వాపురం మండలంలో అంగన్ వాడీ కేంద్రాల్లో స్థితి గతులు పరిశీలించారు. తొలిసారి జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అశ్వాపురం మండలం అంబేద్కర్ నగర్లో అంగన్ వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్ వాడీ కేంద్రంలో పరిస్థితి అడవిని తలపించేలా ఉంది. దోమలు వ్యాప్తి జరిగే అవకాశం ఉందని, అంగన్ వాడీ కేంద్రంలో ఇంత అపరిశుభ్రంగా ఉంటే చిన్నారులెలా ఆరోగ్యంగా ఉంటారంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపునీరు నిలుస్తున్నదని, మేరువు చేయించాలని ఆమె పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆ పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని, తక్షణమే శుభ్రం చేయించాలని చెప్పారు. అశ్వాపురం మండలంలోని 74 అంగన్ వాడీ కేంద్రాలను ప్రత్యేక కార్యక్రమం చేపట్టి శుభ్రం చేయించి ఫోటోలతో సహా నివేదికలు అందచేయాలని ఆదేశించారు. కేంద్రం అపరిశుభ్రంగా ఉంటే, అందుకు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంగన్ వాడీ కేంద్రాలకు నిత్యావసర వస్తువుల సరఫరా, స్టాకు వివరాల గురించి మహిళా సంక్షేమ అధికారినడిగి తెలుసుకున్నారు. స్టాకులో ఏ వ్యత్యాసాలు రాకుండా పకడ్బందీగా పర్య వేక్షించాలని, తేడా వస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ఇచ్చే ‘టేక్ హోమ్’ పౌష్టికాహారాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ డా.ప్రియాంక పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకోసం అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆ కేంద్రానికి సరఫరా అయిన కోడిగుడ్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సులక్షణ, ఎంపిపి సుజాత, సర్పంచ్ శారద, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, సిడిపిఓ సీత, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

Divitimedia

సీయం ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తుకు సెప్టెంబర్ 21 చివరి గడువు

Divitimedia

మెగా డీఎస్సీ వేయకపోతే కేసీఆర్ ప్రభుత్వ పాలన భూస్థాపితం చేస్తాం

Divitimedia

Leave a Comment