ప్రత్యేక ఓటరు సవరణ క్యాంపులు పకడ్బందీగా నిర్వహించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులను పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా. ప్రియాంకఅల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఐడిఓసి మినీ సమావేశ మందిరంలో ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, ఎలక్ట్రో లిటరసీ క్లబ్స్ నిర్వహణ, బూత్ స్థాయి అధికారుల ఫోన్ నంబర్లు అప్ డేట్ చేయడం, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈనెల 27ఆదివారం, వచ్చేనెల 2, 3 తేదీల్లో జరుగనున్న ప్రత్యేక క్యాంపుల నిర్వహణపై గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు తెలియజేసే విధంగా టామ్ టామ్ వేయించాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వారి వారి ఓటును పరిశీలించుకునే విధంగా సమాచారం క్షేత్రస్థాయికి చేరేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంపే నివేదికల్లో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చేసి, నివేదికలు పంపాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల ఫోన్ నెంబర్లను అప్డేట్ చేయాలని సూచించారు. నెలాఖరులోగా నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలు పరిశీలించి నివేదికలందజేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీఆర్వో రవీంద్రనాథ్, ఎస్డీసీ కాశయ్య, భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.