అంగరంగ వైభవంగా గోదావరి నదీహారతి


✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాచలం దివ్యక్షేత్రంలోని పుణ్య గోదావరి స్నానఘట్టాల్లో నిర్వహిస్తున్న గోదావరి నదీహారతి పరాభవ నామ సంవత్సర, దక్షిణాయనం గ్రీష్మరుతువు ఆషాడమాసం శుక్లపక్షంలోకి ప్రవేశించి భక్తుల సంఖ్యను మరింత పెంచుతోందని పురోహితులు రామావజ్జుల రవికుమార్ తెలిపారు. శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రం భద్రాచలంలోని గోదావరి నదీ తీరంలో ఆదివారం సాయంత్రం నదీ హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, ఆషాడమాసం, శుక్లపక్షం అత్యంత విశేషమైనదని, ఆషాడమాసం ద్వాదశి రోజు భద్రాద్రిలో నిర్వహిస్తున్న గోదావరి నదీహారతి విశిష్టమైనదన్నారు. పురోహితులు నదీహారతి విశేషాలు, ఆషాడమాసం ద్వాదశికి సంబంధించిన విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ చేశారు. భక్తులచే సృష్టింపచేసిన దీపోత్సవం పూజాద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చనచేసి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా శాంతి మంత్రపఠనం జరిపి పురోహితుల సంఘం తరఫున ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమానికి రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ తరఫున పూజా సామాగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్ శర్మ, పవన్ కుమార్ శర్మ, రామాచార్యులు, వీరభద్రశర్మ, సుబ్రహ్మణ్యచార్యులు, తిరుపతిరావు, ఎన్.ఎస్.ఎన్.రెడ్డి, రామకృష్ణ, తేజశర్మ, అశోక్ కుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు.

