ఇకనుంచి అందుబాటులో ‘పోలీస్ అక్క’


విధులపై మహిళాపోలీసులకు జిల్లా ఎస్పీ నిర్దేశం
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
మహిళలు, బాలికల భద్రతకు ‘పోలీస్ అక్క’ పేరుతో నూతన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో “పోలీస్ అక్క” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే లక్ష్యంతో మహిళా పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు “పోలీస్ అక్క”గా పనిచేస్తూ, విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. అక్కడ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, బుల్లీయింగ్, ఈవ్ టీజింగ్, స్టాకింగ్, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు నిర్భయంగా పోలీసులకు తెలియజేసేలా విశ్వాసాన్ని కల్పించాలని సూచించారు. అదేవిధంగా నేరానికి సంబంధించి సమాచారమేదైనా అందిన వెంటనే సంబంధిత ‘షీ టీమ్’ కు, ఎస్హెచ్ఓ కు సమాచారం అందించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, పోలీస్ అక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడంలో మహిళా పోలీసులందరూ కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు.”పోలీస్ అక్క” కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలుచేసి మహిళలు, బాలికల భద్రత పట్ల మరింత భరోసా కల్పించాలని మహిళా పోలీసుసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఎస్బీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, షీటీం ఎస్హెచ్ఓ రమాదేవి, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

