ఉన్నత లక్ష్యాల సాధనకు శ్రమించాలి
విద్యార్థులకు కలెక్టర్, ఎమ్మెల్యే సూచనలు
✍️ దివిటీ మీడియా (మార్కాపురం)
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని వాటిని సాధించేందుకు శ్రమించాలని, మంచి భవిష్యత్తు సాధించుకోవాలని మార్కాపురం జిల్లాకలెక్టర్ ఎం.విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం
మార్కాపురం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం( మెగా పీటీఎం-4.O) లో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు నిత్యం శ్రమించాలన్నారు. విద్యార్థులు సైతం ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు శ్రమించాలని సూచించారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో మార్కాపురం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానం సాధించడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో 580కి పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులకు రూ. 20 వేల చొప్పున ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తన సొంత డబ్బును కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందజేశారు.

