పోలీస్ వాహనాలను ఎప్పుడూ కండీషన్లో ఉంచుకోవాలి
పోలీసు వాహనాలు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
✍️ దివిటీ – కొత్తగూడెం (నవంబరు 24)
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అన్ని పోలీసు వాహనాలను మంచి కండీషన్లో ఉంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు డ్రైవర్లకు సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, అధికారుల వాహనాల పరిస్థితులను సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ వాహనాల రవాణాధికారి ఆర్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని పోలీస్ వాహనాల డ్రైవర్ల సమస్యలు, డ్యూటీలో భాగంగా వారి పనితీరు గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి వెహికల్ కండిషన్ ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. పోలీస్ శాఖలో డ్రైవర్లుగా పనిచేసే వారు ఖచ్చితంగా రోడ్డుభద్రతా నియమాలు పాటించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడంలో పోలీసు వాహనాల డ్రైవర్ల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి డ్రైవర్ తమ వాహనం పనితీరు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. డ్రైవర్లు తమ విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పౌర వాహనాల తనిఖీల సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. విధుల పరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐ ఎంటిఓ సుధాకర్, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

