బాధ్యతారాహిత్యంపై ప్రశ్నించిన భార్యను చంపేశాడు
మహిళ హత్యకేసులో ఆమె భర్త అరెస్ట్
✍️ దివిటీ – బూర్గంపాడు (సెప్టెంబరు 2)
కొంతకాలం నుంచి అప్పులు చేసి, నెల రోజుల నుంచి ఏ పనీ చేయకుండా ఇంటి దగ్గరే ఉంటూ వృధా ఖర్చులు చేస్తుంటే ప్రశ్నించిందని కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపేశాడో వ్యక్తి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో సోమవారం అర్థరాత్రి 12గంటల సమయంలో చోటుచేసుకున్న షేక్ మహిమూదా(32) హత్య కేసులో మంగళవారం పోలీసులు ఆమె భర్త షేక్ షంషేర్ పాషాను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పాల్వంచ సీఐ కె.సతీష్, బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వివరాల ప్రకారం… బూర్గంపాడులో ఆటోడ్రైవరు షేక్ షంషేర్ పాషా కొంత కాలం నుంచి అప్పులుచేసి, గత నెలరోజులుగా ఏ పనీ చేయకుండా ఇంటి దగ్గరే ఉంటూ వృధా ఖర్చులు చేస్తుంటే, అలా ఎందుకు చేస్తున్నావంటూ అతని భార్య షేక్ మహిమూదా అడిగింది. తనను భార్య ఆ విధంగా అడిగినందుకు కోపంతో ఊగిపోయిన అతను, ఆమెను గొంతునులిమి హతమార్చాడు. ఈ సంఘటన గురించి మృతురాలి తల్లి షేక్ సలీమా ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడైన షంషేర్ పాషాను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీఐ సతీష్, ఎస్సై ప్రసాద్ తెలిపారు.

