క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నేడు ఎంపికలు
✍️ భద్రాచలం – దివిటీ (మార్చి 25)
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో క్రీడా పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఫైనల్ సెలెక్షన్స్ ఈనెల 26(నేడు) బాలురకు కిన్నెరసాని క్రీడాపాఠశాలలో, 27న బాలికలకు కాచనపల్లి క్రీడాపాఠశాలలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫైనల్ ఎంపికలకు ఎంపిక కాబడిన విద్యార్థులందరితోపాటు ఇంకా ఎవరైనా విద్యార్థులున్నట్లయితే వారు కూడా డైరెక్టుగా ఫైనల్ సెలెక్షన్స్ లో పాల్గొనాలని సూచించారు. బాలురకు కిన్నెరసాని క్రీడాపాఠశాలలో, బాలికలకు కాచనపల్లి క్రీడాపాఠశాలలో పాల్గొన వచ్చునని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయం గమనించి తమ తమ విద్యార్థులను 26 ఉదయం 8-30 గంటలకు బాలురు కిన్నెరసానిలో, బాలికలు కాచనపల్లి క్రీడాపాఠశాలలో రిపోర్ట్ చేయాలని పీఓ కోరారు. ఈ ఎంపికల కోసం విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు -2,
టీ షర్ట్ -షర్ట్ వెంట తీసుకు రావాలని తెలిపారు. డివిజనల్ స్థాయి సెలెక్షన్స్ లో బాలురు 296మంది, బాలికలు 269 మంది, మొత్తం 565 మంది విద్యార్థులు పాల్గొన్నారని, 1: 2 రేషియో ఫైనల్ ఎంపికలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ విద్యార్థినీ విద్యార్థులను 9 రకాల బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు లోడిగ రామారావు, కుర్సం వెంకటేశ్వర్లు, కాచనపల్లి క్రీడాపాఠశాల ఏఎస్ఓ వెంకటనారాయణ, పీడీ బాలసుబ్రమణ్యం, వార్డెన్ శంకర్, కోచ్ లు ఈ ఎంపికలు నిర్వహిస్తారన్నారు.