భద్రాచలంలో అష్టలక్ష్మీ యాగం పరిసమాప్తం



పాల్గొన్న ‘పుష్ప సినిమా’ నటి కల్పలత
✍️ ఎటపాక, భద్రాచలం – దివిటీ (మార్చి 23)
లోక కల్యాణార్థం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఉష్ణగుండాల వద్ద ఈ నెల(మార్చి) 12న అంకురార్పణతో ఆరంభమైన శ్రీ అష్టలక్ష్మీ యాగం 23న ఆదివారం మహాకుంభ ప్రోక్షణతో ఘనంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, రాత్రి శ్రీలక్ష్మీనారాయణస్వామి కళ్యాణం నిర్వహించారు. పీఠాధిపతి పీతాంబరo రఘునాధాచార్యస్వామి పర్యవేక్షణలో యజ్ఞబ్రహ్మ రఘుపుంగవాచార్య, రుత్వికులు కళ్యాణతంతు వైభవంగా నిర్వహించగా భక్తులు కనులారా వీక్షించి తరించారు. స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవంలో పలువురు స్థానిక ప్రముఖులతో పాటు పుష్ప సినిమాలో నటించిన కల్పలత, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం మహా కుంభ ప్రోక్షణ కార్యక్రమం జరిగింది. వేద మంత్ర సహిత జలాన్ని పీఠాధిపతి రఘునాథాచార్య భక్తులపై చల్లి అశీర్వదించారు. ముగింపురోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఎటపాక తహసీల్దార్ సుబ్బారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అష్టలక్ష్మీ యాగం జయప్రదానికి కృషి చేసినవారందరికీ మంగళాశాసనాలు చేసిన స్వామీజీ, ఆలయ నిర్మాణానికి కూడా ఇదేవిధంగా సహకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ యాగం జరిగినన్ని రోజులూ పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో యాగం నిర్వహణ కమిటీ సభ్యులు గాదె మాధవరెడ్డి, భాస్కర్రావు, లక్ష్మణరావు, కంభంపాటి సురేష్, రాంరెడ్డి, రాజేందర్, జగన్నాథరాజు, అష్టలక్ష్మీ వైభవ దీపిక కమిటీ మహిళలు, భక్తులు పాల్గొన్నారు.