Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelangana

‘కక్ష’ల్లో కాలిపోయిన మిర్చిపంట…

‘కక్ష’ల్లో కాలిపోయిన మిర్చిపంట…

మిర్చిపంట దహనం కేసులో ఇద్దరి అరెస్టు

✍️ పినపాక – దివిటీ (మార్చి 17)

తన భార్య చావుకు కారణమయ్యాడనే అనుమానం ఒకరిది… తనను గ్రామంలో పెద్దమనిషిగా ఎదగడానికి అడ్డుపడుతున్నాడనే అక్కసు మరొకరిది… ఇద్దరూ అతనిపై ‘కక్ష’ తీర్చుకోవాలని ‘ప్లాన్’ వేశారు… ‘అతడిని ఆర్థికంగా దెబ్బతీస్తే తమపై ఎవరికీ ఏమీ అనుమానం రాదులే’ అనుకున్నారు… ఓ రాత్రిపూట పొలం వద్ద ఎవరూ కాపలా లేని సమయం చూసి, తమ శత్రువు ఎంతో కష్టపడి పండించిన ‘మిర్చిపంట’కు నిప్పుపెట్టి కాల్చేశారు… ఎండనకా వాననకా ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చినప్పుడే నోటికి అందకుండా పోయిందని, కోలుకోలేనంత నష్టపోయామని కుమిలిపోతూ, తమ శత్రువైన ఆ బాధితుడి కుటుంబం అనుభవించిన ‘క్షోభ’ను చూసిన ఆ ఇద్దరు అంతటితో తమ కక్ష తీరిందనుకున్నారు… ఇదంతా తమ దర్యాప్తులో తేల్చిన పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు… అందరినీ బాధకు గురిచేసిన పినపాక మండలం వెంకట్రావుపేట ‘మిర్చి దహనం’ కేసులో దర్యాప్తు వివరాలను సోమవారం ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి తన పొలంలో పండించిన 50 క్వింటాళ్ల మిరపకాయలు కళ్లంలో ఎండబెట్టారు. పదిరోజుల క్రితం అతను కాపలా లేని సమయంలో ఆ మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టారు. నోటికాడికొచ్చిన పంట కాలిపోవడంతో ఆ రైతు కుటుంబం పడిన బాధ, క్షోభ వర్ణణాతీతం… పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా బాధితులను పరామర్శించి ఓదార్చారు. త్వరగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. బాధితుడు ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ‘సీరియస్’గా తీసుకున్న పోలీసులు మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై రాజ్ కుమార్ ముమ్మరంగా దర్యాప్తు చేశారు. లభించిన సాక్ష్యాధారాలతో అదే గ్రామానికి చెందిన రైతులు తాండ్ర బాలకృష్ణ, అతనికి మామ వరుసయ్యే మంచర్ల వెంకటేశ్వర్లు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు వెంకటేశ్వరపురం గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుంటే ఆ ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్వర్లుకు చెందిన మోటార్ సైకిల్ పై పారిపోతుంటే పట్టుకుని విచారించగా పూర్తి వివరాలు లభించినట్లు తెలిపారు. నిందితుడు తాండ్ర బాలకృష్ణ భార్య సంవత్సరం క్రితం చనిపోగా, పురుషోత్తం మంత్రాలు చేయడం వల్లనే ఆమె చనిపోయిందని బాలకృష్ణ మనసులో కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని తనకు మామ వరుసయ్యే వెంకటేశ్వర్లుకు చెప్పడంతో అతడు కూడా తనకు కూడా పురుషోత్తం మీద ఉన్న కక్ష వెళ్లగక్కాడు. తనను పెద్దమనిషిగా ఎదగనీయకుండా పురుషోత్తమే అన్ని పంచాయతీలలో అడ్డుపడుతున్నాడని వెంకటేశ్వర్లు చెప్పాడు. తమ శత్రువు పురుషోత్తంను ఎలాగైనా ఆర్థికంగా దెబ్బ తీయాలని ఇద్దరూ ‘ప్లాన్’ వేసుకుని సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 10వ తేదీ అర్ధరాత్రి సమయంలో మిర్చికళ్లాల వద్ద ఎవరు కాపలా లేరని గమనించి, అక్కడ కుప్పగా వేసి ఉన్న పురుషోత్తం సంబంధించిన 50క్వింటాళ్ల మిర్చిపై బాలకృష్ణ, తాను తెచ్చిన ఐదు లీటర్ల పెట్రోలు చుట్టూ చల్లి నిప్పు పెట్టాడు. ఆ సమయంలో ఎవరూ రాకుండా వెంకటేశ్వర్లు రోడ్డుపై కాపలా ఉన్నాడు. మిర్చికి మంటలు అంటుకున్న వెంటనే ఇద్దరు అక్కడ్నుంచి పారిపోయి ఏమీ తెలియనట్లుగా ఆ రాత్రి ఇళ్లలోనే నిద్రించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును త్వరగా ఛేదించిన ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,
ఎస్సై రాజ్ కుమార్ లను మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్
సిబ్బంది లక్ష్మీనారాయణ, దిలీప్, శ్రీనివాస్, రాము, లక్ష్మయ్య పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలలో ‘తిధి భోజనం’

Divitimedia

గ్రామపంచాయతీ ట్రాక్టర్ పల్టీ, కార్మికుడికి తీవ్ర గాయాలు

Divitimedia

నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

Divitimedia

Leave a Comment