దేవాలయంలో బోర్ పంపు కోసం ఎమ్మెల్యేకు వినతి

✍️ మణుగూరు – దివిటీ (జనవరి 11)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం ఉమ్మడి గ్రామ పంచాయితీ పరిధిలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో మంచినీటి బోర్ పంపు ఏర్పాటుచేయాలని రెండు గ్రామ పంచాయతీల భక్తులు కోరుతున్నారు. ఈమేరకు గొందిగూడెం, తుమ్మలచెరువు గ్రామపంచాయితీలకు చెందిన తిరుపతమ్మ మాలాధారణ భక్తులు శనివారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యేను వారు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వినిపించారు. గొందిగూడెం పంచాయతీ పరిధిలోని శ్రీవెంకటేశ్వరస్వామిఆలయం భక్తులకు నిలయంగా, ఆదివాసీ గూడేల్లో దైవభక్తి భావజాలాన్ని వ్యాపింప చేస్తూ, ప్రాధాన్యత కలిగి ఉందని వివరించారు. ప్రజల్లో భక్తిభావాలు, మానవత్వపు విలువలు నింపుతున్న దేవాలయంలో ధ్వజస్థంభం నీటి సదుపాయం కూడా లేదని తెలిపారు. కాబట్టి శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బోర్ వెల్ వేయించాలని, ధ్వజస్తంభం తిరిగి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి గొంది గోపాలకృష్ణ, పాయం సర్వేశ్వరరావు, కందుల శ్రీనివాసరావు,
తిరుపతమ్మ మాలధారణ భక్తులు పాల్గొన్నారు.