రాత్రివేళలో ఎల్ఆర్ఎస్ లేకుండానే 99 రిజిస్ట్రేషన్లు
వైరా సబ్ రిజిస్ట్రార్పై మంత్రి పొంగులేటి సీరియస్

విచారణకు ఆదేశించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ
✍️ దివిటీ నెట్ వర్క్ (జనవరి 10)
ఖమ్మం జిల్లాలోని వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా అర్ధరాత్రి సమయంలో జరిగిన 99 రిజిస్ట్రేషన్లు కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహించిన విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఖమ్మం పరిసర ప్రాంతాలకు చెందిన ఎల్ఆర్ఎస్ లేని 99ప్లాట్లను అధికారులు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. నగరపాలకసంస్థ ఖమ్మంకు సరిహద్దుగా ఉండే వైరా పురపాలకసంఘంతో పాటు కొణిజర్ల మండలం పరిధిలోని వెంచర్లో ఉన్న 99 ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఆమోదం లేకుండా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పరంగా ఎల్ఆర్ఎస్ అనుమతి లేని లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ప్రభుత్వ నిబంధనలున్నాయి. వైరాలో ఈ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మరీ ఎల్ఆర్ఎస్ లేని అనేక ప్లాట్లను అధికారులు గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారమంతా అర్ధరాత్రి సీక్రెట్ గా జరిగినట్లు ఆయన దృష్టికి రావడంతో ఆ రిజిస్ట్రేషన్లు, నిబంధనల ఉల్లంఘనలపై ఉన్నతాధికారులను ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
డీఐజీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా ఉందిలే, ఎవరూ పట్టించుకోరనే ధీమాతో అధికారులు ఈ అక్రమ వ్యవహారాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరికొన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలున్నాయని రెవెన్యూశాఖ వర్గాల సమాచారం.