సారపాక ఐటీసీలో INTUC జెండా ఎగురవేయాలి
మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్
✍️ బూర్గంపాడు – దివిటీ (జనవరి 10)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పరిశ్రమలో ఈనెల 31న జరుగ నున్న గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల గెలుపుతో జెండా ఎగురవేయాలని మాజీ కేంద్ర మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాంనాయక్ కోరారు. శుక్రవారం ఐటీసీ గెస్ట్ హౌస్ లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులతో సమావేశమైన సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరంగా తన పరంగా ఐఎన్టీయూసీ కార్మికసంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది గనుక ఐఎన్టీయూసీ మిత్రపక్షాలను గెలిపించుకుంటే, ప్రభుత్వంతో యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చైనాసరే కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతనం ఒప్పందం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, మిత్రపక్షాల అధ్యక్షుడు గోనె రామారావు. ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, తదితర యూనియన్ నాయకులతో పరిశ్రమలో జరుగనున్న ఎన్నికల నిర్వహణ, పరిశ్రమలలో ఉన్న పరిస్థితుల గురించి ఎంపీకి వివరించారు. ఈ కార్యక్రమంలో మోతీలాల్ అనే కార్మిక సోదరుడు, తదితరులు ఎంపీ బలరాం నాయక్ సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.