పంచాయతీ ఉద్యోగులకు గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు

పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 9)
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రతి నెలా రూ.116కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉందని, వారికీ ప్రతినెలా తప్పకుండా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్ష చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని, ఆ పనులకు సంబంధించి మొత్తం బిల్లులు చెల్లించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాలలోనే అభివృద్ధికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే రాబట్టుకోవాలని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ధనసరి సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.