భూమాత మాడ్యూల్లో సమస్యలు, పరిష్కారాలపై నివేదించాలి


వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 7)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న భూమాత పోర్టల్ అమలుకు ముందు మాడ్యూల్లో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఐడీఓసీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి జిల్లాలోని ఆర్డీఓలు, తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూమాత మాడ్యూల్ అమలులో భాగంగా పోర్టల్ లో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలను తహసిల్దార్లందరూ లిఖిత పూర్వకంగా, నిర్దేశిత పట్టిక ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వచ్చిన సూచనలు, సలహాలను ఉన్నతాధికారులకు పంపడం ద్వారా మాడ్యూల్ లో మార్పులు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ఓఆర్ చట్టం, కొత్త చట్టంపై తహసిల్దార్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలు, మండలాల పరిధిలో ఉన్న అటవీశాఖ భూముల వివరాలు అటవీశాఖ గెజిట్, రెవెన్యూ రికార్డులతో సరిచూసి ఏ సర్వే నెంబర్లో ఎంత అటవీ భూములున్నాయో గుర్తించాలని ఆదేశించారు. దీని ద్వారా మిగిలిన ప్రభుత్వ భూములను ఎయిర్ పోర్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల వంటి అభివృద్ధి పనుల కోసం ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.