ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
✍️ భద్రాచలం – దివిటీ (జనవరి 1)
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ఉత్సవాల కోసం వచ్చే పర్యాటకుల బసకోసం విర్మిస్తున్న తాత్కాలిక విడిది (హట్స్) అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గోదావరి కరకట్ట వద్ద ఖాళీ ప్రదేశాల్లో నిర్మిస్తున్న పర్యాటకుల విడిది గృహాలను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, స్దానిక అధికారులతో కలిసి పరిశీలించారు. గృహాల్లో పర్యాటకులు బస చేయడానికవసరమైన పరుపులు, వారికి విడిదిలో కల్పించవలసిన భోజన సౌకర్యాలు గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రివర్ ఫెస్టివల్ 9వ తేదీన ప్రారంభిస్తున్నందున సంబంధిత అన్ని ఏర్పాట్లు 6వ తేదీలోగా పూర్తి చేసి రెండు రోజులు లాంచనంగా పరిశీలించాలని ఆదేశించారు. జనవరి 9న సంబంధిత అధికారులు, తమకప్పగించిన పనులు సమన్వయంతో పూర్తిచేసి, భక్తులకు తెలిసే ప్రారంభించాలన్నారు. విడిది చేసే గృహాలలో గిరిజన వంటకాలు మాత్రమే సరఫరా చేయాలని, వ్యర్ధాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్ బిన్స్ ఏర్పాట్లు చేయాలన్నారు. కరకట్ట దగ్గర ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ లో గిరిజనులకు సంబంధించిన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ స్టాల్స్ లో తేనె, కరక్కాయ పొడి, గిరిజనుల పాతకాలపు డిజైన్లలో నగలు, వెదురు, కుమ్మరికమ్మరి తయారీ వస్తువులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళల స్టాల్స్ ఏర్పాటుచేయాలన్నారు. ఆ స్టాల్స్ లో పర్యాటకులకు విక్రయయించేవాటిని అందంగా ప్యాక్ చేసి, తక్కువ ధరలకు అందించే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. పర్యాటకులు మరలా మరలా సందర్శించే విధంగా ఆకర్షణగా ఉండేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన వంటకాల్లో శాఖాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులంతా తమకు అప్పగించిన పనులు సమన్వయంతో పూర్తిచేసి భద్రాద్రి పుణ్యక్షేత్రానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వర్, ఏసీఎంఓ రమణయ్య, మిషన్ భగీరథ రాజారావు, ఏపీఎంలు జగదీష్, కిషోర్, జేడీఎం హరికృష్ణ, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, తదితరులు పాల్గొన్నారు.