ఎస్టీ సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో న్యాక్ పరిశీలన

స్వయంగా రంగంలోకి దిగి వివరాలిచ్చిన ఐటీడీఏ పీఓ
✍️ పాల్వంచ – దివిటీ (నవంబరు 22)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వసతి సదుపాయాలను న్యాక్ (నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సెల్) శుక్రవారం పరిశీలించింది. ఆ కాలేజీకి న్యాక్ గుర్తింపు కోసం పరిశీలన జరుగుతుండటంతో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ స్వయంగా రంగంలోకి దిగారు. సకల సౌకర్యాలతో విద్యాబోధన చేస్తూ, విద్యార్థినులకు పై చదువులు చదవడానికి ప్రత్యేకచర్యలు తీసుకుంటున్న వివరాలను ఆయన న్యాక్ బృందానికి వివరించారు. మంచి మెనూతోపాటు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో విద్యా బోధన చేస్తున్నట్లు వివరించారు. లేబొరేటరీ సౌకర్యం, కంప్యూటర్ శిక్షణ సమయానుకూలంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. విశాలమైన ఆటస్థలం, సైన్స్ ల్యాబ్ తో పాటు విద్యార్థినుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థినులు జేఈఈ, నెట్, ఎంసెట్ కోచింగ్ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, అలాగే ర్యాంక్ వచ్చినవారు వివిధ రాష్ట్రాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థినులకు ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి నెల విద్యార్థినుల తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి, తమ పిల్లల చదువు, మేధాశక్తి పట్ల ఉన్న పరిజ్ఞానాన్ని వారికి వివరిస్తున్నామన్నారు. ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా 24 గంటలు పనిచేసేలా ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నట్లు పీఓ వెల్లడించారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఈ కళాశాలలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అన్ని వసతులు కల్పించి, మంచి విద్యాబోధన చేస్తున్నామని, ఆటవిడుపుగా ఇక్కడి విద్యార్థినులను విహారయాత్రలకు తీసుకు వెళ్లడం కూడా జరుగుతోందని ఆయన న్యాక్ పరిశీలకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం ఆర్సీఓ నాగార్జునరావు, కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, న్యాక్ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.