సీసీఐ కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్
✍️ సుజాతనగర్ – దివిటీ (నవంబరు 10)
సీసీఐ ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలంలోని డేగలమడుగు గ్రామంలో ఏర్పాటుచేసిన పత్తి జిన్నింగ్ మిల్లును జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జిల్లాల.వి.పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను పరిశీలించి, అక్కడ నిల్వ ఉన్నపత్తిలో తేమశాతాన్ని స్వయంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రైతుల వద్ద కొనుగోళ్లు జరగాలన్నారు. సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా తేమశాతం 8 నుంచి 12 మధ్యలో ఉండే విధంగా పత్తి మార్కెట్ కు తీసుకొచ్చేలా రైతులకు సూచించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. మిల్లులోకి పత్తి తెచ్చినప్పట్నుంచి, తేమ శాతం పరీక్ష, తూకం, విక్రయం ధర, రైతుల వేలిముద్రల తో కూడిన ఆధార్ అనుసంధానం, ఓటీపీ విధానం తదితర అన్ని విషయాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎన్ని రోజుల్లో ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాట్సప్ చాట్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు రెండు పనిదినాల్లో పరిష్కరించాలని ఆదేశించారు. కొనుగోలుకేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.7521 రైతులకు చెల్లించాలన్నారు. రైతులు దళారులనాశ్రయించకుండా, సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కొనుగోలు కేంద్రంలో సీసీఐ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పౌరసరఫరాల అధికారి త్రినాథ్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.