అక్కడ మద్యం తాగొద్దన్నందుకు నలుగురిని చంపారు…
తమిళనాడులో ఘోరం; ఒకే కుటుంబంలో నలుగురి హత్య
✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. తమ స్థలంలో మద్యం తాగొద్దన్నందుకు ఓ కుటుంబంపై దాడిచేసి ఏకంగా నలుగురిని పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఆన్ లైన్ మాధ్యమ సమాచారం ప్రకారం… తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్ సమీపంలో ఈ దారుణం చోటు చేసకుంది. పల్లడం సమీపంలోని కల్లకినరు గ్రామంలో సెంథిల్ కుమార్ (47) అనే వ్యక్తి బియ్యం వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ గ్రామంలో అతనికి కొంత స్థలం ఉంది. కాగా ఆ ఖాళీస్థలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం మద్యం సేవిస్తుండగా సెంథిల్ కుమార్ వారిని అడ్డుకున్నాడు. ఆ స్థలంలో మద్యం తాగొద్దంటూ వారించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తులు సెంథిల్ కుమార్ పై కత్తులతో దాడిచేశారు. వారిని అడ్డుకునేందుకు సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు మోహన్ రాజ్, రత్నాంబల్, పుష్పవతి అక్కడికి వెళ్లగా వారిపైన కూడా నిందితులు విచక్షణారహితంగా దాడిచేసి
గాయపర్చారు. ఈ దారుణ సంఘటనలో గాయపడిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సెంథిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురి మృతదేహాలు తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీఇచ్చి పోలీసులు గ్రామస్తులను శాంతింపజేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఇదిలా ఉండగా ఈ దారుణ హత్యలతో సెంథిల్ కుమార్ దుకాణంలో పనిచేసిన వెంకటేశన్ అలియాస్ కుట్టికి సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో బీజేపీ స్థానికశాఖ కార్యవర్గసభ్యుడిగా ఉన్న మోహన్ రాజ్ కూడా ఉన్నాడు. మృతులకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై సంతాపం ప్రకటించారు.