ఒడిశాలో భీభత్సం సృష్టిస్తున్న పిడుగుల వర్షం
2 గంటల్లోనే 60 వేలకు పైగా పిడుగులు
పిడుగులతో 12 మంది దుర్మరణం
✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్
వడగళ్లవాన లాగానే పిడుగుల వాన కురిసింది. కేవలం రెండంటే రెండు గంటల్లో ఏకంగా 60వేలకు పైగా పిడుగులు పడి 12 మంది దుర్మరణం చెందారు. అత్యంత దారుణమైన ఈ పరిస్థితి మనదేశంలోనే ఒడిశా రాష్ట్రంలో నెలకొంది. కొన్ని రోజుల నుంచి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కుంభవృష్టి లాగా కురుస్తున్న వర్గాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకుతోడు పిడుగులు బీభత్సం సృష్టిస్తుండటంతో ఆ రాష్ట్రంలో భయానకమైన పరిస్థితి ఏర్పడింది. శనివారం ఒక్కరోజే 2 గంటల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఏకంగా 61 వేల పిడుగులు పడినట్లు అధికారులు చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. దాదాపు మరో 14 మంది గాయపడినట్లు చెప్తున్నారు. కుర్దా జిల్లాలో నలుగురు, బలంగీర్ జిల్లాలో ఇద్దరు, అంగుల్, బౌధ్, థెంకనల్, గజపతి, జగత్సింగ్ పూర్, పూరీ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది మరణించినట్లు చెప్తున్నారు. గజపతి, కంధమాల్ జిల్లాల్లో పిడుగుపాటు వల్ల 8 పశువులు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పిడుగుల వల్ల మరణించినవారి ఒక్కొక్క కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒడిశాలో ఇంతటి భయానక పరిస్థితుల్లో సెప్టెంబరు 7వ తేదీ వరకు తీవ్ర వాతావరణ పరిస్థితులుంటాయని భారత వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రజలు భయంభయంగా గడువుతున్నారు.