కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
✍️ దివిటీ మీడియా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ (ఉప్పుసాక వద్ద) శివార్లలో కోడిపందాల స్థావరంపై శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా కోడిపందాలలో పాల్గొన్న 9 మంది వ్యక్తులను అదుపు లోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి విశ్వసనీయ సమాచారం రావడంతో ఆ కోడిపందాల స్థావరంపై దాడిచేసి నిందితులను పట్టు కున్నారు. వారి నుంచి రూ.17వేలు, 8 సెల్ ఫోన్లు, 8బైకులతోపాటు పందాలకు ఉపయోగించిన ఏడు కోళ్లు, 12కత్తులు స్వాదీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్(సీఐ) రమాకాంత్ తెలిపారు. పట్టుబడిన నిందితులను బూర్గంపాడు పోలీసులకు అప్పగించి ఆ 9 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 కు ఫోన్ చేసి తగిన సమాచారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణా, పేకాట, కోడిపందాలు, బెట్టింగుల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

