స్థానిక ఎన్నికల్లో ప్రజలు సహకరించాలి


‘కమ్యూనిటీ కనెక్ట్’లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను
✍️ దివిటీ – ఇల్లందు (నవంబరు 25)
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్లతండాలో జరిగిన ‘కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం’లో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని అన్ని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్రవాహనాల పత్రాలు పరిశీలించి సరైన పత్రాలున్న వాహనాలు తిరిగి యజమానులకు అప్పగించారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ చంద్రభాను పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీల ఎన్నికల దృష్ట్యా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికల నియమావళిననుసరిస్తూ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణకు నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గుండాల, ఇల్లందు, టేకులపల్లి సీఐలు రవీందర్, సురేష్, సత్యనారాయణ, ఎస్సైలు రవూఫ్, నాగుల్ మీరా, సోమేశ్వర్, రాజేందర్, శ్రీనివాసరెడ్డి, 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

