పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలుశిక్ష
✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (నవంబరు 24)
ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన(పోక్సో) కేసులో నిందితుడికి ఏడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జి, అదనపు ఇంచార్జి) ఎస్.సరిత సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసు దర్యాప్తులో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక గాంధీనగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన కల్తీ వెంకటేశ్వర్లు 2020 డిసెంబర్ 9వ తేదీన అఘాయిత్యానికి పాల్పడినట్లు 12వ తేదీన అందిన ఫిర్యాదుపై బూర్గంపాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి.బాలకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి పాల్వంచ సబ్ డివిజన్ పోలీస్ అధికారి (దర్యాప్తు అధికారి) కేఆర్కే ప్రసాదరావు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో మొత్తం 10 మంది సాక్షులను విచారించిన తర్వాత నిందితుడు కల్తీ వెంకటేశ్వర్లుపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఏడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు 3000 రూపాయల జరిమానా విధించారు. ఈ జరిమానా చెల్లించని యెడల మూడు నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్షపడే విధంగా కృషిచేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మీ, కోర్టు నోడల్ అధికారి(ఎస్సై) డి.రాఘవయ్య, లైజన్ అధికారి ఎస్.వీరభద్రం, కోర్టు డ్యూటీ అధికారి మహమ్మద్ అక్రమ్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

