సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు : ట్రైనీ కలెక్టర్ మురళి

జిల్లాలో ఇండియా హౌస్ బృందం పర్యటన
✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (నవంబరు 23)
సేంద్రియ పద్ధతిలో పండించిన పంటల్లో సమృద్ధిగా పోషకాలుంటాయని ట్రైనీ కలెక్టర్ మురళి తెలిపారు. ఆదివారం పాల్వంచ మండలంలోని పేటచెరువు ప్రాంతంలో చరిత ఆర్గానిక్ ఫుడ్స్ తయారీ కేంద్రాన్ని, సుజాత్నగర్లోని రవి హైబ్రిడ్ సీడ్స్ విత్తన పరిశోధన కేంద్రాన్ని ఆయన ఇండియా హౌస్ బృందంతో కలిసి పరిశీలించారు. చరిత ఆర్గానిక్ ఫుడ్స్ లో సేంద్రియ ఉత్పత్తుల ప్రత్యేకత, తయారీ విధానాల గురించి నిర్వాహకులనడిగి తెలుసుకున్నారు. సుజాత్నగర్లోని రవి హైబ్రిడ్ సీడ్స్ విత్తన పరిశోధనకేంద్రాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్, అక్కడి పరిశోధకులతో శాస్త్రీయ అంశాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మురళి మాట్లాడుతూ, సేంద్రియ, జీవ ఆధారిత వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు. సేంద్రియ వ్యవసాయం పర్యావరణానికి, నేల ఆరోగ్యానికి, భూముల దీర్ఘకాలికమైన ఉత్పాదకతకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. పాడి పరిశ్రమ, పశుపోషణను వ్యవసాయంతో అనుసంధానించడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరమన్నారు.
పంటలకు సహజంగా పోషకాలందించే జీవ ఎరువులు, సేంద్రియ పదార్థాలు వాడడం ద్వారా తెగుళ్లు, కలుపును రసాయనాలు లేకుండా నియంత్రించవచ్చని చెప్పారు. నేల, నీటి కాలుష్యం తగ్గి, నేలలో సూక్ష్మజీవులు సజీవంగా ఉండేలా చేస్తుందని, ఫలితంగా స్థిరమైన దిగుబడులు లభిస్తాయని మురళి పేర్కొన్నారు.
ప్రకృతి సేంద్రియ సాగును విస్తృతంగా ప్రోత్సహించి, రైతులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.

