హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
✍️ దివిటీ – కొత్తగూడెం (18 నవంబరు)
తల్లిని హత్యచేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు వెలువరించారు. కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రంపూర్ తిలక్ నగర్ ఏరియాలో 2024 మే 10న జరిగిన సంఘటనలో నిందితుడైన లోద్ రమేష్ కు జడ్జి జీవితఖైదు విధించారు. ఆ సంఘటనపై నిందితుడి బంధువైన రామవరం గ్రామానికి చెందిన కోరీ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగిన పోలీసు విచారణలో వివరాల ప్రకారం… లారీడ్రైవర్ గా పనిచేస్తూ మద్యానికి బానిసైన లోద్ రమేష్ ను అతని భార్య గొడవ పెట్టుకుని విడిచి వెళ్లిపోయింది. ఆ మనస్థాపంతో అధికంగా తాగుతూ తిరుగుతున్న నేపథ్యంలో రమేష్ 2024 మే 10 వ తేదీన ఇంటికి చికెన్ తీసుకెళ్లి తన తల్లి లోద్ దులారీభాయికి ఇచ్చి వండమని చెప్పాడు. తినే సమయంలో చికెన్ తక్కువయిందని గొడవ పెట్టుకుని అతను తల్లితోపాటు తండ్రి శ్యామ్ లాల్, తన ఇద్దరు పిల్లలపై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన దులారీభాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 మే 14న మృతి చెందింది. ఈ కేసులో అప్పటి ఇన్స్పెక్టర్ టి.రమేష్ కుమార్ విచారణాధికారిగా దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో 15 మంది సాక్షులను విచారణ జరిపి, వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి, లోద్ రమేష్ పై నేరం రుజువైందని అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్షపడేవిధంగా కృషి చేసిన ప్రస్తుత కొత్తగూడెం టూటౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి.లక్ష్మి, నోడల్ అధికారి డి.రాఘవయ్య, కోర్టు లైజన్ అధికారి ఎన్.వీరబాబు, కోర్ట్ డ్యూటీ అధికారి ఎల్.బిక్కులాల్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

