ఐటీడీఏ పథకాలపై దిసోం ప్రతినిధుల పరిశీలన

వివరాలందించిన ఐటీడీఏ పీఓ రాహుల్
✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 18
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దిసోమ్ సంస్థ నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది విద్యార్దులు భద్రాచల ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అధ్యయనం చేసేందుకు వచ్చి, గురువారం పీఓ రాహుల్ ను కలిసారు. ఈ సందర్భంగా ఆయన ఆ ప్రతినిధులకు ఐటీడీఏ పథకాల గురించి వివరించారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీగిరిజనుల సంక్షేమం, గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు నిరుపేదలైన గిరిజన కుటుంబాలకందించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీ మహిళలకు సబ్బులు, మిల్లెట్ బిస్కెట్స్, న్యూట్రి బాస్కెట్, చిక్కి యూనిట్, దాల్ మిల్, బ్రిక్స్ తయారీ, న్యూట్రి డ్రైమిక్స్, ఇప్పపువ్వు లడ్లు వంటి వాటితోపాటు నాప్కిన్స్ తయారీ యూనిట్ల. ఏర్పాటుకు శిక్షణ, సాయం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం, ప్రభుత్వంనుంచి వివిధరకాల సంక్షేమ పథకాలు అందించి, ఆర్థికంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పునాదిస్థాయి నుంచి విద్య బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్స్, కెరీర్ గైడెన్స్ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పీఓ వెల్లడించారు. వైటీసీ ద్వారా నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు పలు అంశాల్లో స్వయం ఉపాధి శిక్షణ అందించి ఉపాధి రంగాల వైపు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని, గిరిజన సంస్కృతి రాబోయే తరానికి తెలిసే విధంగా గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశామని పీఓ వివరించారు. గిరిజనుల యొక్క గోత్రాలు తెలుసుకుని ఇలవేల్పుల గ్రంథం రూపొందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. దిసోమ్ సంస్థ స్థాపకుడు బిరేన్ భాటు మాట్లాడుతూ, తమ సంస్థ విద్యార్ధులు 15 నెలలపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల గురించి తెలుసుకుంటారని తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం అద్భుతంగా తీర్చి దిద్దారని, ఐటీడీఏ పీఓ ఆదివాసీలకు మంచి పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేరళ నుంచి గిరిజ మావిలన్, అస్సాం నుంచి మిజింగ్ నర్జరి, మహారాష్ట్ర నుంచి మునిర్, ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీను సోడె, లెనిన్ సోడె, ఇండిజినెస్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి పాయం రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

