అంతరపంటల సాగుతో ఆర్థికాభివృద్ధి
వెదురు మొక్కలు నాటిన కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 15
అంతరపంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ తెలిపారు. ములకలపల్లి మండలం మూక మామిడి పంచాయతీ పరిధిలోని గుట్టగూడెంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. కనితి భద్రయ్య, కనితి రాధ, కనితి పొట్టమ్మల పొలాల్లో కలెక్టర్ స్వయంగా వెదురు మొక్కలు నాటారు. గ్రామీణ వ్యవసాయరంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. మొగరాలగుప్ప గ్రామంలో రైతు కీసర సుజాత పొలంలో వెదురుసాగు మొక్క నాటి ప్రారంభించారు. కొండ్రు వెంకటమ్మ పొలంలో మునగసాగు, గడ్డంవారిగుంపు గ్రామంలో రైతు కొమ్ము బుచ్చన్న సాగు చేస్తున్న మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతి రైతు సంప్రదాయపంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలని సూచించారు. అంతరపంటల సాగుతో తక్కువ భూమిలోనూ అధికాదాయం పొందవచ్చని, ఆయిల్ పామ్ తోటల్లో మునగ, బెండ సాగుచేస్తే అదనపు ఆదాయం వస్తుందని వివరించారు. వెదురుసాగులో పెసలు, బొబ్బర్లు, రాగి, మినుములు వంటి పంటలు వేసుకుంటే ఆదాయం మరింతగా పెరుగుతుందని తెలిపారు. ప్రతి పంట కేవలం రైతుల కుటుంబాలకే కాక గ్రామ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. కొత్త పంటలపై నమ్మకం పెట్టుకుని సాగు చేస్తే తప్పకుండా మంచిఫలితాలు వస్తాయని, వెదురుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉందని కలెక్టర్ తెలిపారు. అక్కడ పండించే వెదురును బెండాలంపాడు బ్యాంబూ క్లస్టర్ ద్వారా పలు రకాల ఉత్పత్తులకు వినియోగించి సులభంగా మార్కెటింగ్ చేయవచ్చన్నారు. తద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కూడా సృష్టించవచ్చన్నారు. ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ మూకమామిడి గ్రామ పంచాయతీ భవన నిర్మాణపనులను పరిశీలించి, త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ములకలపల్లి తహసిల్దార్ గన్యానాయక్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏటీఎం వెంకయ్య, ఏపీఓ హుస్సేన్, ఎల్డీఎం సమ్మక్క, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

