ఐఎన్టీయూసీ మిత్రపక్షాల వినూత్న నిరసన

✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ పరిశ్రమలో కార్మికుల కోసం నిర్మించ తలపెట్టిన ‘ఇండోర్ స్టేడియం’ సమస్యపై ఆ పరిశ్రమలోని ఐఎన్టీయూసీ మిత్రపక్షాలు ఆదివారం వినూత్నంగా నిరసన ప్రదర్శించారు.
ఎన్నికలకు ముందు యాజమాన్యం, గుర్తింపుసంఘం కుమ్మక్కై సంవత్సరం క్రితం భూమి పూజ చేసిన ఇండోర్ షటిల్ కోర్ట్ పిచ్చిమొక్కలతో బురదమయంగా ఉందన్నారు. నిరసనగా ఆ ప్రదేశంలోనే షటిల్ ఆడుతూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు కోసం కార్మికులను మభ్యపెట్టి ఆనాడు శంకుస్థాపన చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో గుర్తింపుసంఘం కట్టించిన ఇండోర్ షటిల్ కోర్టు యావత్ ప్రపంచం గర్వించే స్థాయిలో ఉందని చెప్పడానికి బురద పిచ్చిమొక్కలే నిదర్శనమని వ్యంగ్యంగా అన్నారు. కార్మిక సోదరులు ఇప్పటికైనా ఇది ముమ్మాటికి గుర్తింపు సంఘం ఎన్నికలస్టంట్ అని అర్థం చేసుకోవాలని కోరారు. దీనికి వత్తాసు పలుకుతున్న కార్పొరేట్ యాజమాన్యం
ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని యాజమాన్యానికి కోరుతున్నామన్నారు. అదేవిధంగా 29 కార్మిక కుటుంబాలను ఖాళీ చేయించే శ్రద్ధ క్వార్టర్లు కట్టేదానిలో చూపించాలన్నారు. నిరుపయోగంగా ఉండి శిధిలావస్థకు చేరిన కాలనీని కార్మికులకు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీ లోనికి డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవేశించి అధ్వానంగా ఉండి, రిపేర్ చేయడానికి కూడా పనిచేయవనే కారణంతో ప్రక్కకు పెట్టిన క్వార్టర్స్, ఈరోజు కార్మికులకు ఎలా కేటాయిస్తారని అన్నారు. కొత్త క్వార్టర్స్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రతిదానికి ఐటీసీ కుటుంబమని, మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్తున్న యాజమాన్యం, కోటర్స్ నిర్మాణం జరిగే వరకు తాత్కాలికంగానైనా మేనేజర్స్ కాలనీలో ఖాళీగా ఉన్న కాలనీలోకి షిఫ్ట్ చేయాలని కోరారు. చిత్తశుద్ధి ఉంటే త్వరతగతిన ఒక బ్లాక్ పూర్తిచేసి ఓ 30 మంది సీనియర్లను అక్కడికి తరలించి, ఖాళీ అయిన వాటిల్లో ఈ కార్మికులకు కేటాయించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేవలం మీ పబ్లిసిటీ స్టంట్ కోసం, ఫొటోలకు ఫోజుల కోసమే కార్మికులను బలి చెయ్యొద్దని గుర్తింపు సంఘాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

