చండ్రుగొండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

✍️ చండ్రుగొండ – దివిటీ (జూన్ 27)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం చంద్రుగొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన అక్కడి పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషనుకు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేవిధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని చెప్పారు. అక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై శివరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.