లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ
✍️ మహబూబాబాద్ – దివిటీ (జూన్ 18)
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రోజురోజుకూ లంచావతారాలపై దాడులు ఉద్ధృతం చేస్తోంది. తాజాగా బుధవారం ఓ ఉన్నతస్థాయి అధికారిని మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. ఆ సంస్థ అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి… తెలంగాణ ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్)లో పని చేస్తున్న మహబూబాబాద్(జిల్లా) సర్కిల్ ఎస్ఈ నరేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. తన పరిధిలోని కురవి, మరిపెడ సబ్-డివిజన్ల కు సంబంధించి ప్రస్తుతం ఉన్న అంగీకార పత్రాలకు సంబంధించిన అగ్రిమెంట్లను కొనసాగేలా ఆమోదం తెలపడానికిగాను అధికారికంగా సహయం చేసేందుకు ఆ లంచం తీసుకుంటున్న క్రమంలో ఆయన పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని నుంచి రూ.1లక్ష లంచం డిమాండ్ చేసిన నరేష్, అందులో బాగంగా ఇప్పటికే రూ.20వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడి చేశారు. మిగిలిన రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలో ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగిన పక్షంలో ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేసి సమాచారం అందించాలని” కోరారు. అంతేకాకుండా సామజిక మాధ్యమాలైన “వాట్సాప్ (నెం. 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB)లతోపాటు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
“ఫిర్యాదుధారుల, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా హామీ ఇచ్చారు.