కొత్త వ్యక్తులొస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలి
ఆళ్లపల్లిలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించిన పోలీసులు
✍️ ఆళ్లపల్లి – దివిటీ (జూన్ 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఓఎస్డీ నరేందర్ సూచనలతో టేకులపల్లి సీఐ టి.సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం అళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారం, పెద్ద వెంకటాపురం వలస ఆదివాసీ గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రాగ్రామ్ నిర్వహించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. తెలియని వ్యక్తులు తమ తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తే వారికి ఆశ్రయం కల్పించొద్దని టేకులపల్లి సీఐ సురేష్ గ్రామస్తులను కోరారు.ఇటీవల వరుస ఎదురు కాల్పులు, అరెస్టుల వల్ల అసాంఘిక శక్తులు తమ రక్షణ కోసం చత్తీస్ గడ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశముందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, మావోయిస్టు సానుభూతిపరులు గ్రామానికి, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కనిపిస్తే స్థానిక పోలీసులకు గానీ, 100కి గానీ ఫోన్ చేసి సమాచారమివ్వాలని, అలా సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి తగిన నగదు పారితోషకం ఇస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని వారికి దూరంగా ఉండాలని తెలియజేశారు. యువత మంచిగా చదువుకుని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించాలని, క్రీడల్లో రాణించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎస్సై ఎం.సోమేశ్వర్, టీజీఎస్పీ, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.