“మిస్ వరల్డ్-2025” పోటీలకు ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
✍️ హైదరాబాద్ – దివిటీ (ఏప్రిల్ 29)
మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి)- 2025 పోటీల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో మే 10వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ పోటీల ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 72వ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి సమావేశంలో అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే అతిథుల కోసం ఎయిర్ పోర్ట్, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఏర్పాట్లు, కార్యక్రమాలకు సంబంధించి విభాగాల వారీ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించాలని సూచించారు.నగరంలో పెండింగులో ఉన్న ‘బ్యూటిఫికేషన్ పనుల’ను త్వరగా పూర్తి చేయాలని, మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పూర్తి చేయాల్సిన పనులు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.