సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం! : ఎస్పీ
ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రయాణం చేస్తుంటే పోలీసులకు సమాచారమివ్వండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 26)
వేసవికాలంలో సెలవుల ప్రారంభంతో ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రివేళ వీధుల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పలు సూచనలు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలని ఎస్పీ కోరారు. దీనివల్ల వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుని, ఊర్లెళ్లిన వారి ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పడం మంచిదన్నారు. విలువైన వస్తువుల సమాచారం, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదన్నారు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమమని, లేదంటే ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లే వారు విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. బ్యాగుల్లో బంగారు నగలు, డబ్బు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బ్యాగులు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంతో సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ ఎవరైనా కొత్త వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.